గ్రేటర్ నోయిడా, జనవరి 8: దేశం వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్తావాల్ చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030వ సంవత్సరానికల్లా 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. సోమవారం నాడిక్కడ ఇండస్ఫుడ్ షో 2024 కార్యక్రమంలో భర్తావాల్ మాట్లాడుతూ రెడీ-టూ-ఈట్ ఫుడ్ తదితర విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, దిగుమతి దేశాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాల్ని పెంచుకోవడంపై దృష్టి నిలపాలని పరిశ్రమకు సూచించారు. ఈ షోను వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రారంభిస్తూ బియ్యం, గోధుమ, చక్కెర తదితర ఎగుమతులపై నియంత్రణలు విధించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులు గత ఏడాది స్థాయిలోనే 53 బిలియన్ డాలర్లకు చేరతాయని చెప్పారు. కొన్ని ఎగుమతులను నియంత్రించడంతో 4-5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితమే వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్న సంగతి తెలిసిందే.