హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కొన్నేండ్లుగా తాము చేస్తున్న కృషి ఫలించినందుకు ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్ల రుణం అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా)తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ ఒప్పందం కుదరడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇది దేశంలోని స్టార్టప్ రంగంలో జైకా సంస్థ పెడుతున్న మొదటి పెట్టుబడి అని తెలిపారు. 2019లోనే తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను సందర్శించాలని జైకా ప్రతినిధి బృందాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ రూపురేఖలను పరిశీలించిన తర్వాత, జైకా బృందంతో సంవత్సరాలపాటు నిరంతర చర్చలు, సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో భారత్, జపాన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారని వివరించారు.