న్యూఢిల్లీ: ఇప్పటికైతే బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీలకు ప్రతికూల వాతావరణం ఉన్నా.. వాటిపట్ల మదుపర్లలో ఆప్యాయత, మక్కువ పెరిగిపోతున్నది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ను డిజిటల్ గోల్డ్ అవతార్ అని భావిస్తున్నారు. ఫలితంగా ప్రపంచంలోని బడా మదుపర్లు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. భారతీయులు అందుకు మినహాయింపేం కాదని వాస్తవాలు చెబుతున్నాయి..
భారతీయుల ఇండ్లలో 25 వేల టన్నులకు పైగా బంగారం ఉంటుంది. కానీ గతేడాది క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు 200 మిలియన్ల డాలర్ల నుంచి సుమారు 40 బిలియన్ల డాలర్లకు దూసుకెళ్లాయి.
2018లో బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విధించిన నిషేధం వారిని నియంత్రించలేకపో పోవడం విశేషం. బంగారం నుంచి క్రిప్టో కరెన్సీ వైపు మళ్లిన రిచి సూద్ (32) డిసెంబర్ నుంచి రూ.10 లక్షలకు పైగా (13,400 డాలర్లు) క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారు.
ఆ రూ.10 లక్షల్లో తన తండ్రి నుంచి కొంత అప్పు తీసుకుని మరీ మదుపు చేశారు రిచి సూద్. బిట్ కాయిన్, డోజ్ కాయిన్, ఏథిరీయంల్లో పెట్టుబడులు పెట్టారు.
ఫిబ్రవరిలో బిట్ కాయిన్ 50 వేల డాలర్లకు చేరుకున్నప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎడ్యుకేషన్ స్టార్టప్ స్టడీ మేట్ ఇండియాను విదేశాల్లో విస్తరణకు బిట్ కాయిన్ నిధులను వాడుకునేందుకు ఆమెకు అనుమతి లభించడం గమనార్హం.
తక్కువ టైంలో రిటర్న్స్ రావాలంటే బంగారం.. ఆస్తి కన్నా బిట్ కాయిన్ బెటర్ అంటున్నారు రిచి సూద్. క్రిప్టో కరెన్సీ అత్యంత పారదర్శక కరెన్సీ అని, బంగారంలో కంటే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తానంటున్నారు.
రిచి సూద్ మాత్రమే కాదు.. బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసే ఇండియన్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. 1.5 కోట్ల మందికి పైగా భారతీయులు ప్రస్తుతం డిజిటల్ కాయిన్స్ క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. వారంతా 18-35 ఏండ్లలోపు కుర్రాళ్లే కావడం మరో విశేషం.
2018లో బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. కానీ గతేడాది ఆర్బీఐ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దరిమిలా ఇండియన్ పెట్టుబడి దారుల్లో డిజిటల్ కరెన్సీల పట్ల ఆసక్తి పెరిగిందన్న మాటలు వినిపిస్తున్నాయి.