Gold Imports | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి పడతులకు చాలా ఇష్టం.. వీలైతే బంగారం ఆభరణాల కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్లో పెండ్లిండ్లలో నవ వధువుకు బంగారం ఆభరణాలు తప్పనిసరి. పండుగల సమయంలో గిఫ్ట్లుగానూ ఆభరణాలు బహుకరిస్తుంటారు. కానీ దేశీయంగా బంగారం ఉత్పత్తి కేవలం ఒకశాతమే. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పదేండ్లుగా 769.7 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.. పుత్తడి దిగుమతిలో పొరుగు దేశం చైనా తర్వాతీ స్థానం మనదే. కానీ గత ఆర్థిక సంవత్సరం పుత్తడి దిగుమతులు తగ్గాయి. ఈ సంగతి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వక సమాధానంలో చెప్పారు.
2019-20తో పోలిస్తే 2020-21లో బంగారం దిగుమతులు 719.94 టన్నుల నుంచి 651.24 టన్నులకు పడిపోయింది. అంతకుముందు 2018-19లో బంగారం దిగుమతులు 982.71 టన్నులని అనుప్రియా పటేల్ తెలిపారు. గత జనవరి 28న ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం 2021లో 797.3 టన్నుల బంగారం భారతీయులు కొనుగోలు చేశారు. గత ఐదేండ్లలో ఇది అత్యధికం అని డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2021లో బంగారం ఆభరణాలకు డిమాండ్ రెట్టింపైంది. పెండ్లిండ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో కరోనా ముందు స్థాయి కంటే ఆరేండ్ల గరిష్టానికి 2021లో 610.9 టన్ను బంగారం ఆభరణాల కొనుగోళ్లు జరిగాయి. పట్టణ వాసులే అత్యధికంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేశారు.
మొత్తం బంగారం దిగుమతులు 2020లో 349.5 టన్నులు కాగా, 2021లో 165 శాతం పెరిగి 924.6 టన్నులకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో వివాహ వేడుకలు జరిగినా కరోనా ప్రభావంతో పెద్దగా బంగారం కొనుగోళ్లు జరుగలేదని తెలుస్తున్నది. వినియోగదారుల్లో విశ్వాసం పెరిగి రిటైల్ ఆభరణాల కొనుగోళ్లు పెరగడంతో ఈ ఏడాది 79 శాతం బంగారం దిగుమతులు జరుగుతాయని అంచనా వేశామని డబ్ల్యూజీసీ తెలిపింది.
ఇక చైనా నుంచి బొమ్మలు, గేమ్స్, ఆటల పరికరాల దిగుమతి తగ్గుముఖం పట్టిందని మరో ప్రశ్నకు సమాధానంగా అనుప్రియా పటేల్ చెప్పారు. 2018-19లో చైనా నుంచి 451.71 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలు దిగుమతయ్యాయన్నారు. కానీ గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 206.11 మిలియన్ డాలర్లకు పడిపోయాయని తెలిపారు.