SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి కొత్త కార్లు కొనాలనుకునే భారతీయులు ఎస్యూవీ కార్లమీద మోజు పెంచుకుంటున్నారు. గత ఐదేండ్లలో కార్ల తయారీ దారులు 36 ఎస్యూవీ మోడల్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో.. ఎస్యూవీ మోడల్స్లోనూ అత్యధిక సేఫ్టీ ఫీచర్లు గల వాటిపై మనస్సు పారేసుకున్నారు. సేఫ్టీతోపాటు సన్రూఫ్, టెక్నాలజీ కనెక్టెడ్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా పాపులరైన ఎస్యూవీ కార్ల కోసం కొనుగొలుదారులు వెయింటింగ్లో ఉండాల్సి వస్తున్నది. కొన్ని మోస్ట్ పాపులర్ మోడల్ కార్ల కోసం రెండేండ్ల వరకూ వెయిట్ చేయాల్సిందే. ధర ఎక్కువైనా సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ కనెక్టెడ్ ఎస్యూవీలను కొనుగోలు చేయడానికే ప్రజలు మొగ్గుతున్నారు.
గతంలో హ్యాచ్బ్యాక్ కార్లకు గిరాకీ ఉండేది. కానీ, ఎంట్రీ లెవెల్, మిడ్ సైజ్డ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) కార్లు రోజురోజుకి పాపులారిటీ పెంచుకుంటున్నాయి. ఫలితంగా ఎస్యూవీ క్యాటగిరీలోనే కొంగొత్త మోడల్ కార్లను ఆవిష్కరించడానికి ఆటోమొబైల్స్ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ & మార్కెటింగ్) మాటల్లో చెప్పాలంటే కొన్నేండ్లుగా ఎస్యూవీ సెగ్మెంట్లో ప్రధానమైన వృద్ధి ఉంటుంది. గతంలో 19 శాతం ఎస్యూవీ కార్ల అమ్మకాలు ఉంటే, 2020-21లో 40 శాతానికి దూసుకెళ్లింది. మున్ముందు మరింత పెరుగుతుందన్నారు. రోడ్ విజబిలిటీ, ఉన్నత ఫీచర్లు గల వాహనాల వైపు మొగ్గడం వల్లే ఎస్యూవీల గ్రోత్కు కారణం అంటున్నారు.
2011లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్లు ఆధిపత్యం ప్రదర్శిస్తే.. గతేడాది ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ సెగ్మెంట్కు డిమాండ్ పెరిగింది. గతేడాది 30.68 లక్షల కార్లు అమ్ముడైతే వాటిలో ఎస్యూవీల వాటా 6.52 లక్షల యూనిట్లు. గత ఐదేండ్లలో మార్కెట్లో కంపాక్ట్, మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లే ఎంటర్ కావడం ఆశ్చర్యమేమీ కాదు.
2016-17లో సేఫ్టీ ఫీచర్లు గల కార్లు 17 శాతం అమ్ముడైతే.. 2021-22లో 24 శాతానికి పెరిగిందన్నారు శ్రీవాత్సవ. ఇటీవల మారుతి కొత్త బ్రెజా మోడల్ కారు ఆవిష్కరిస్తే.. మొత్తం వివిధ కార్ల బుకింగ్స్లో 70 శాతం దానివే.
సేఫ్టీతోపాటు వెసులుబాటు పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందంటున్నారు టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర. ఫీచర్లు, వేరియంట్లు, బ్రాండ్ కొత్త ఉత్పత్తుల వైపు మళ్లుతున్నారు. నూతన శ్రేణి ఎస్యూవీ కార్ల పట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నాక కార్ల తయారీ సంస్థలు అటువైపు దృష్టి మళ్లించారంటున్నారు. ఎస్యూవీలతోపాటు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లను తేవడంతో మార్కెట్లో మూడో స్థానానికి దూసుకొచ్చింది టాటా మోటార్స్.
ఎస్యూవీల్లో బోల్డ్, స్టైలిష్, పొడవైన కార్ల పట్ల భారతీయులు మొగ్గుతున్నారని కియా మోటార్స్ ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్ సిక్ సోన్ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చిన కరెన్స్ మోడల్ కారు కేవలం ఐదు నెలల్లోపు 30 వేలకు పైగా అమ్ముడైందన్నారు. కియా మోటార్స్ కార్లలో అత్యధికం టాప్ ట్రిమ్ మోడల్సే.
శరవేగంగా పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధి సాధించడంతో ఎస్యూవీలకు డిమాండ్ పెరిగిందని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ స్ట్రాటర్జిక్ మార్కెటింగ్) అతుల్ సూద్ తెలిపారు. న్యూ కామ్రీ హైబ్రీడ్, న్యూ గ్లాంజా మోడల్ కార్లకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదంటారాయన.