SUV Cars | భారత్లో రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 42 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తొమ్మిది శాతం గ్రోత్ రికార్డైంది. మొత్తం కార్ల విక్రయాల్లో సగ భాగం ఎస్యూవీ కార్లే ఉండటం ఆసక్తికర పరిణామం. 2022-23తో పోలిస్తే ఎస్యూవీ కార్ల విక్రయాలు 28 శాతం, ఓవరాల్ కార్ల మార్కెట్లో 50.4 శాతం వాటా పొందాయి. ఎస్ యూవీ కార్లలో 28 శాతంతో మహీంద్రా మొదటి స్థానంలో నిలిస్తే, మారుతి సుజుకి 22 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎస్యూవీ కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ మోడల్ కార్లతో ఎస్యూవీ కార్ల సేల్స్ పెరిగాయి. గత 12 నెలల్లో మారుతి బ్రెజా.. టాప్-3లో ఒకటిగా నిలిచింది.
ఎస్యూవీ కార్ల సేల్స్లో మొదటి స్థానంలో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 28 శాతం కార్లు విక్రయించింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో -ఎన్, ఎక్స్యూవీ700, థార్, ఎక్స్యూవీ300 మోడల్ కార్లతో మొత్తం 4.59 లక్షల కార్లు విక్రయించింది. బుల్లి ఎస్యూవీ కార్లు టాటా పంచ్, టాటా నెక్సాన్లతో టాటా మోటార్ పాపులారిటీ పుంజుకున్నది. పెద్ద ఎస్ యూవీ కార్లు హారియర్, సఫారీలకు పంచ్, నెక్సాన్ జత కలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లు హ్యుండాయ్ మోడల్సే. భారత్ లో శరవేగంగా అమ్మకాలు జరుగుతున్న హ్యుండాయ్ ఎస్యూవీ కార్లలో క్రెటా, వెన్యూ నిలిచాయి. సెడాన్ కార్ల విక్రయాలు ఆరు శాతానికి, హ్యచ్ బ్యాక్ కార్ల వాటా 28 శాతానికి పడిపోయింది.