UPI-World | విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు.. ఏ దేశంలోనైనా యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) చేసేయవచ్చు. ఇందుకోసం వారు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ పే (Google Pay) యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో భారతీయులు ‘యూపీఐ’ పేమెంట్స్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తూ ‘గూగుల్పే’తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిలెడ్ (ఎన్ఐపీఎల్) అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేసింది. ఈ ఎంఓయూతో అంతర్జాతీయంగా యూపీఐ చెల్లింపులు బలోపేతం అవుతాయి. ఇప్పటి వరకు విదేశీ కరెన్సీ, క్రెడిట్ కార్డు, ఫారిన్ కరెన్సీ కార్డులతో డిజిటల్ లావాదేవీలు జరిపిన ఆయా దేశాల మర్చంట్ల వద్ద భారత్ కస్టమర్లు లావాదేవీలు చేయడం తేలికవుతుంది.
‘ఎన్ఐపీఎల్తో అవగాహనా ఒప్పందం వల్ల భారత్ బయట ప్రయాణిస్తున్న ఇండియన్స్ తేలిగ్గా లావాదేవీలు జరిపేందుకు యూపీఐ పేమెంట్స్ విస్తరణకు ఉపకరిస్తుంది. నిరంతరాయ ఆర్థిక లావాదేవీల కోసం.. విదేశాల్లో యూపీఐ తరహా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నెలకొల్పేందుకు సహాయకారి అవుతుంది. యూపీఐ మౌలిక వసతులను ఉపయోగించుకుని వివిధ దేశాల మధ్య చెల్లింపు (విదేశీ కరెన్సీ స్వీకరణ)ల ప్రక్రియ సరళతరం చేయడానికి వీలవుతుంది’ అని గూగుల్ పే ఓ ప్రకటనలో తెలిపింది.
‘భారతీయ పర్యాటకులకు విదేశాల్లో లావాదేవీలు జరిపేందుకు తేలిక కావడంతోపాటు విదేశాల్లో విజయవంతంగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అమలు చేయడానికి ఇది దోహద పడుతుంది. ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాల్లో యూపీఐ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేస్తుంది’ అని ఎన్ఐపీఎల్ సీఈఓ రితేశ్ శుక్లా తెలిపారు. గూగుల్ పే ఇండియా పార్టనర్ షిప్ డైరెక్టర్ దీక్షా కౌశల్ మాట్లాడుతూ ‘సురక్షితంగా చెల్లింపులు సౌకర్యవంతం చేయడానికి తమ నిబద్దతకు ఈ ఎంఓయూ నిదర్శనం. అంతర్జాతీయ మార్కెట్లోకి యూపీఐ వెళ్లేందుకు ఎన్ఐపీఎల్కు మద్దతు తెలుపుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.