న్యూఢిల్లీ, జూన్ 28: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ భారత్ స్టాక్ సూచీ లు మరో ల్యాండ్మార్క్ను చేరుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 64,000 మార్క్ను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,000 స్థాయిని తాకాయి. కొద్దిరోజులుగా ఆమడదూరం నుంచి చేజారిపోతున్న ఆల్టైమ్ గరిష్ఠస్థాయిని నిఫ్టీ ఎట్టకేలకు చేధించినట్లు అయింది. 2022 డిసెంబర్ 1న నెలకొల్పిన ఆల్టైమ్ గరిష్ఠస్థాయిని ఈ నెల 21న సెన్సెక్స్ దాటిన సంగతి తెలిసిందే. 18,887 పాయింట్ల స్థాయిని దాటి ఇదే ఫీట్ను బుధవారం నిఫ్టీ సాధించడంతో పాటు 19,000 మైలురాయిని సైతం ఇంట్రాడేలో అధిగమించి 19,011 పాయింట్ల నూతన గరిష్ఠాన్ని చూసింది. చివరకు 155 పాయింట్లు లాభపడి 18,972 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 64,050 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పి, చివరకు 499 పాయింట్ల లాభంతో 63,915 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఈ స్థాయిల్లో సూచీలు ముగియడం సైతం ఇదే ప్రథమం.
పలు అంశాలు ఒకే రోజున కలిసిరావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పటిష్ఠపడిందని, దీంతో ఒక్క ఉదుటన షార్ట్ కవరింగ్, కొనుగోళ్లు జరిగినట్టు విశ్లేషకులు తెలిపారు.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతుండటంతో మదుపరులు ఎగిరిగంతేస్తున్నారు. బుధవారం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో వరుసగా రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.3,43,718.15 కోట్లు పెరిగి రూ. 2,94,11,131.69 కోట్లకు చేరుకున్నది. ఈ నెల 21న రికార్డు స్థాయి రూ. 2,94,36,594.50 కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే.