ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఇవాళ మరింత పతనమైంది. ఇటీవల కాస్త కోలుకున్నట్లే కనిపించిన రూపాయి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 71 పైసలు పతనమై రూ.82.95కి దిగజారింది. గత కొన్ని రోజులుగా రూపాయి పతనం కొనసాగుతుండటంతో.. దేశం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ, కేంద్రం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని చెబుతున్నది. డాలర్ బాగా బలపడటంవల్లే రూపాయి విలువ తగ్గుతున్నది తప్ప, రూపాయి పతనం కావట్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సెలవిచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ రూపాయి విలువ మరింత పతనమైంది. దాంతో డాలర్ మరింత బలపడిందేమోలే.. అంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచుతూ పోతుండటం.. రూపాయి మారకం విలువ రోజురోజుకు తగ్గిపోతుండటానికి కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాగా, రూపాయి బలహీన పడటంతో అప్పటిదాకా లాభాల్లో కొనసాగిన భారత స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం నుంచి నష్టాల బాటపట్టాయి.