న్యూఢిల్లీ, మే 26: గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి లేదా క్యూ4)గాను దేశ జీడీపీ 4.9 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో దేశ జీడీపీ 4.4 శాతంగా నమోదైన నేపథ్యంలో ఈసారి అర శాతం పెరగవచ్చన్న అభిప్రాయాన్ని ఇక్రా తాజాగా వెలిబుచ్చింది. వృద్ధిరేటును సేవా రంగమే నడిపించగలదన్నది. ఈ క్రమంలోనే క్యూ3తో పోల్చితే క్యూ4లో సర్వీసెస్ గ్రాస్ వాల్యూ (జీవీఏ) 6.2 శాతం నుంచి 6.4 శాతానికి పెరగవచ్చని చెప్పింది. ఈ నెల 31న నాల్గో త్రైమాసికంతోపాటు 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి జీడీపీ గణాంకాలను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేయనున్నది.
అకాల వర్షాలతో కొన్ని పంటలు దెబ్బతినడం వల్ల దిగుబడులు తగ్గిపోవచ్చని ఇక్రా అంటున్నది. ఈ క్రమంలోనే క్యూ4లో వ్యవసాయ రంగానికి సంబంధించి జీవీఏ 3.5 శాతానికి పడిపోయే వీలుందని చెప్తున్నది. క్యూ3లో ఇది 3.7 శాతంగా ఉన్నది. అయినప్పటికీ ఈ ఏడాది రబీ ఉత్పత్తి బాగానే ఉండొచ్చని, ఇందుకు పెరిగిన పంట విస్తీర్ణం, సాగునీటి వనరులు, ఎరువుల లభ్యత కారణమని అభిప్రాయపడింది. ఇక ఇండస్ట్రియల్ జీవీఏ క్యూ3తో చూస్తే క్యూ4లో 2.4 శాతం నుంచి 3.6 శాతానికి పెరగవచ్చని ఇక్రా ఈ సందర్భంగా అంచనా వేసింది. తయారీ, గనుల రంగాల కార్యకలాపాల్లో వృద్ధికి వీలుంటుందన్న ఆశాభావాన్ని కనబర్చింది.