పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డైట్టెంది ఇప్పుడు సగటు భారతీయుడి పరిస్థితి. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి దొరికినకాడికి తినేద్దాం.. అందినకాడికి అమ్మేద్దాం అన్నట్టుగానే ఉంది మరి.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. వాటిని ఒక్కొక్కటిగా ప్రైవేట్ బాట పట్టిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. తద్వారా శ్రీమంతుల చేతికి మరింత సంపద అందుతుండగా, సామాన్యుడికి మాత్రం తిప్పలు తప్పడం లేదు.
బ్యాంకులనే కాదు.. వాటిని నియంత్రించే ఆర్బీఐనీ మింగేయాలన్నంత ఆకలి. కార్పొరేట్ల క్షేమమే పరమావధిగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థల ఆస్తులను అమ్ముకుని పాలన సాగించే దుస్థితికి దిగజారింది.
‘కాదేది కవితకు అనర్హం’ అన్నారో మహాకవి. లేదేది అమ్మకానికి అనర్హం అంటున్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో వాటాలను విక్రయించడం, వాటి ఆస్తులను అమ్మడమే పనిగా పెట్టుకున్నది. మొన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను విక్రయానికి తెచ్చిన కేంద్రం.. నిన్న ఎయిర్ ఇండియాను అమ్ముకున్న విషయం తెలిసిందే. రేపు బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీలో వాటాలను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ పోతున్నది. లాభాల్లో ఉందా?.. లేక నష్టాల్లో ఉందా?.. అన్నదానితో ప్రమేయం లేకుండా ఖజనాను నింపుకోవడమే ధ్యేయంగా వెళ్తున్నది. ఎయిర్ ఇండియా అడ్డగోలు అమ్మకమే ఇందుకు నిదర్శనం. ఇలాగే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్నూ అగ్గువకే అమ్మేయాలని చూస్తున్నారు. ఇక ప్రైవేటీకరణను వేగవంతం చేయడానికి ప్రభుత్వ సంస్థల విలీనాలకూ తెరతీశారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఇది జోరుగా సాగుతున్నది. 2020లోనే 10కిపైగా పీఎస్యూ బ్యాంకులు 4 బ్యాంకులుగా మారాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో 22గా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య.. ఇప్పుడు 12కు పడిపోయింది.
బిజినెస్ డెస్క్: కనుమరుగైన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కూడా ఉండగా, దీన్ని ఎస్బీఐలో కలిపేసిన విషయం తెలిసిందే. చివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్థిక పరిపుష్ఠినీ దెబ్బతీసేలా డివిడెండ్లను కోరడం, ఆర్బీఐ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న విషయాన్ని మరువరాదు. టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ నష్టపోయిన తీరునూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాగా, ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 2020-21లో రూ.2.10 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా రూ.32,385 కోట్లనే పొందగలిగింది. ఇలా ఏటేటా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ బాట పట్టిస్తుండగా, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక 2021లో సగటు భారతీయుల ఆదాయం 84 శాతం పడిపోగా, దేశంలో బిలియనీర్ల సంఖ్య మాత్రం 102 నుంచి 142కు పెరిగినట్టు ఇటీవల ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది. దీంతో సంపద సృష్టిలో, ఆ సంపద పంపకాల్లో ప్రభుత్వ విధానాలకు ఇది అద్దం పడుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన పీఎస్యూల నష్టాలు
ప్రతికూల మార్కెట్ పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై పీఎస్యూలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. 2014లో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైంది. నాడు (2015-16లో) నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల సంఖ్య 79గా ఉన్నది. 2019-20 నాటికి ఇవి 84కు చేరడం గమనార్హం. అలాగే లాభాల్లో ఉన్న పీఎస్యూలు సైతం 175 (2016-17లో) నుంచి 171 (2019-20) పడిపోయాయి. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలే ఈ వివరాలను ప్రకటించాయి.
ఎగిసిన బ్యాంకింగ్ మోసాలు
గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ మోసాల ఫిర్యాదులు 1.45 లక్షలకు పెరిగాయి. 2020-21లో 1,45,309కి చేరాయని మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2019-20లో 1,35,448గా ఉన్నాయి. దీంతో ఏడాది వ్యవధిలో దాదాపు 10వేలు పెరిగినైట్టెంది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ మోసాలు పెరిగాయన్నారు. ఇప్పటికే బ్యాంకులకు వేల కోట్ల రూపాయల్లో ఎగవేసి విదేశాలకు కార్పొరేట్లు పారిపోయిన సంగతి విదితమే.