న్యూఢిల్లీ, మే 17:దేశీయ ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) లాభాలకు పెట్రోకెమికల్స్, చమురు ధరలు గండికొట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నికర లాభం 31.4 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను రూ.6,021.88 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.6.56 ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.8,781.30 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.9.56 గా ఉన్నది. కానీ, మూడో త్రైమాసికంలో నమోదైన రూ.5,860.80 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం పెరిగింది. ఆదాయం మాత్రం భారీగా పుంజుకున్నది. చమురు ధరలు రికార్డు స్థాయిలో దూసుకపోవడంతో కంపెనీ రూ.2.06 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇది రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు సంస్థ వాటాదారులుకు శుభవార్తను అందించింది. ప్రతి రెండు షేర్లకు గాను ఒక్క షేరును బోనస్గా ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి రెండు షేర్లకు ఒక్క షేరు ఉచితంగా కేటాయించనున్నది. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు రూ.3.60(బోనస్ కంటే ముందు) తుది డివిడెండ్తోపాటు రూ.2.40(బోనస్ తర్వాత) తుది డివిడెండ్ను సంస్థ ప్రకటించింది. ఇప్పటికే సంస్థ రూ.9 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది.
పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలు 8 శాతం తగ్గి రూ.8,251.29 కోట్లకు పడిపోయింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ నికర లాభం రూ.21,836.04 కోట్ల నుంచి రూ.24,184.10 కోట్లకు చేరుకున్నది. అలాగే రూ.7.28 లక్షల కోట్లు లేదా 96 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఒక్క ఏడాదిలో ఇంతటి స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించిన రెండో దేశీయ అతిపెద్ద ఐవోసీ కావడం విశేషం.
ప్రతి బ్యారెల్ క్రూడాయిల్ను శుద్ది చేయడంతో సంస్థ 18.54 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఇది 10.59 డాలర్లుగా ఉన్నది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్యకాలంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను రూ.10 వడ్డించింది.
దీంతోపాటు వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా గత రెండు నెలల్లో రూ.100 పెంచింది.