భారత్లో సెమికండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానిపై ప్రధానితో చర్చించాను. అహ్మదాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనంద్ వద్ద 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమికండక్టర్ ప్లాంట్ను నెలకొల్పబోతున్నాం
– సంజయ్ మెహరోత్రా, మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో
గాంధీనగర్, జనవరి 9: అంతర్జాతీయ కంపెనీల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రారంభానికి ముందురోజే సుజుకీ మోటర్ కార్ప్, మైక్రాన్ టెక్నాలజీ, ఏపీ మోలర్ వంటి గ్లోబల్ సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. ప్రధానంగా వీరు పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్టుబడుల అవకాశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది.
మోదీతో సమావేశమైన అనంతరం సుజుకీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో భారత్ చాలా కీలకమైన మార్కెటని, దేశీయంగా తయారైన వాహనాలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని, ఇక్కడే వాహన స్క్రాపింగ్, రీసైక్లింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. గుజరాత్లో మారుతి సుజుకీ రెండో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. దీంతో సంస్థకు భారత్లో ఉన్న ప్లాంట్ల సంఖ్య ఐదుకి చేరుకోనున్నాయి.
12 వరకు వైబ్రాంట్ సమ్మిట్
ఈ నెల 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు గుజరాత్లో వైబ్రంట్ సమ్మిట్ జరగబోతున్నది. పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ సదస్సుకు 133 దేశాలకు చెందిన లక్ష మంది హాజరయ్యే అవకాశాలున్నాయని నిర్వహకులు తెలిపారు.