Indian IT Hiring | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఇప్పుడు ఐటీ రంగంలో హాట్ స్పాట్స్. జియోగ్రఫికల్గా ప్రథమ శ్రేణి నగరాల నుంచి ద్వితీయ శ్రేణి నగరాల వైపు మళ్లడంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి స్కిల్స్ వైపు పరివర్తన చెందుతోంది ఐటీ రంగం. 2023తో పోలిస్తే 2024లో అంతర్జాతీయ అనిశ్చితి, మైక్రో సూక్ష్మ ఆర్థిక సవాళ్లు తదితర అంశాలతో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు ఏడు శాతం తగ్గుముఖం పట్టాయి.
కొత్త నైపుణ్యాలతో ఐటీ రంగం పరివర్తన దిశగా అడుగులేస్తున్న తరుణంలో నియామకాలపై మరింత ఆశావాహ దృక్పథం కనిపిస్తోంది. భారత్ లో త్వరలో ఏర్పాటు కానున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) తో ఉద్యోగ నియామకాల్లో వృద్ధి నమోదవుతుందని అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్ కోటిల్ తెలిపారు. టెక్ ప్రొఫెషనల్స్ కోసం 52.6 శాతం జాబ్ ఓపినింగ్స్ నమోదవుతాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి టూల్స్ లో నిపుణులకు 39 శాతం డిమాండ్ పెరిగింది. అన్ని సంస్థల్లో నైపుణ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 2024 తృతీయ త్రైమాసికంలో దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 48 శాతం ఐటీ నియామకాలు వృద్ధి చెందాయి. మిడ్ టూ సీనియర్ లెవెల్ ఎక్స్పీరియెన్స్ ఎగ్జిక్యూటివ్స్ కోసం 35 శాతం నియామకాలు జరిగాయి. అన్ని సెక్టార్లలో 2-15 శాతం నియామకాలు నమోదయ్యాయి.
42 దేశాలతో పోలిస్తే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఫ్రెష్ నియామకాలు 53 శాతం పెరుగుతాయని మాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వే అంచనా వేసింది. వీప్రో సీటీఓ సంధ్య అరుణ్ మాటల్లో చెప్పాలంటే.. ఐటీ రంగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు దూసుకెళ్తుంది. ఆటోమేటిక్ రొటిన్యూ టాస్క్స్ కోసం ఏఐ డ్రైవెన్ టూల్స్ మెషిన్ లెర్నింగ్, రీడిఫైన్డ్ జాబ్ రోల్స్ కు ప్రాధాన్యం ఏర్పడుతోంది.