Cyber Crime | ముంబై, మే 27: అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) వివరాలు చెప్తున్నాయి. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసం, గేమింగ్ యాప్స్, అల్గరిథమ్ అక్రమాలు, చట్టవిరుద్ధమైన రుణ యాప్లు, ఓటీపీలను ఇతరులకు పంపడం వంటి వాటిల్లో బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. తాజాగా నవీ ముంబైలోని ఖర్ఘర్ టౌన్షిప్కు చెందిన ఓ 48 ఏండ్ల వ్యక్తి కూడా షేర్ ట్రేడింగ్ కుంభకోణంలో చిక్కుకుని రూ.1.07 కోట్లు మోసపోయాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసులు 15 మందిపై 420సహా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఓ యాప్, వెబ్సైట్ ఓనర్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు బాధితుడిని మోసగాళ్లు పలుమార్లు కలిశారని, షేర్ ట్రేడింగ్ నుంచి ఆకర్షణీయమైన లాభాలను ఇప్పిస్తామని నమ్మబలికారని నవీ ముంబై సైబర్ పోలీస్ సీనియర్ ఇన్స్పెక్టర్ గజానన్ కదమ్ తెలిపారు. ఈ క్రమంలోనే వివిధ బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడిగా 1,07,09,000 రూపాయలను డిపాజిట్ చేయించుకున్నారన్నారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేదని, దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు ఫిర్యాదు చేశాడని గజానన్ వివరించారు.
మోసపోతున్నాం ఇలా..
సైబర్ నేరగాళ్లు ఫలానా బ్యాంక్ లేదా దర్యాప్తు ఏజెన్సీల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఆర్బీఐల అధికారులమంటూ అమాయకులను భయపెట్టి, నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు. తమ ఖాతాల్లోకి భారీగా నగదును బదిలీ చేసేసుకుంటున్నారని వివిధ కేసుల్లో దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. కాగా, గత 4 నెలల్లో 3.25 లక్షల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసిన అధికారులు.. మరో 5.3 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. 3,401 సోషల్ మీడియా అకౌంట్లనూ డీఆక్టివేట్ చేశారు. ఆగ్నేయాసియా దేశాల్లోని వివిధ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని భారత్ను సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని 14సీ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. వీటిలో కంబోడియా, థాయిలాండ్, మయన్మార్ దేశాలున్నట్టు చెప్పారు.