న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేస్తున్న ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లనూ దాఖలు చేసింది. కాగా, ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పరిమాణం రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ప్రకారం పబ్లిక్ ఇష్యూలో ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ రూ.500 కోట్లదాకా ఉండనున్నది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (వోఎఫ్ఎస్)లో వాటాదారులు, ప్రమోటర్లకు చెందిన 14,12,99,422 ఈక్విటీ షేర్లు అమ్మకానికి పెట్టనున్నారు. ఇందులో బీవోబీ 8,90,15,734 షేర్లను, కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3,92,27,273 షేర్లను, యూనియన్ బ్యాంక్ 1,30,56,415 షేర్లను అమ్మనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్లో బీవోబీకి గరిష్ఠంగా 65 శాతం వాటా ఉన్నది. కార్మెల్కు 26 శాతం, యూనియన్ బ్యాంక్కు 9 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీవో అనంతరం షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో నమోదు కానున్నాయి.