న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఇండియా యమహా మోటర్ తమ 125సీసీ స్కూటర్ మాడళ్లు రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, ఫాసినో 125 ఫై హైబ్రిడ్లకు చెందిన దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నది. బ్రేక్ భాగాల్లో సమస్యల పరిష్కారార్థం ఈ రీకాల్కు ఈ జపాన్ టూవీలర్ దిగ్గజ సంస్థ దిగింది.
కాగా, 2022 జనవరి 1 నుంచి ఈ ఏడాది జనవరి 4 మధ్య తయారైన వాహనాల్లోనే ఈ సమస్య వచ్చినట్టు కంపెనీ చెప్తున్నది. తమ కస్టమర్ల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తామని, అందుకే సమస్యను గుర్తించిన వెంటనే రీకాల్కు పిలుపునిచ్చామని యమహా ఓ ప్రకటనలో తెలియజేసింది. వాహనదారులకు ఉచితంగానే ఈ సర్వీస్ అందుతుందని, సమీపంలోని యమహా సర్వీస్ సెంటర్కు వెళ్లాలని సూచించింది.