LIC IPO | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఐపీవో ప్రక్రియ వేగం పుంజుకుంటున్నది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఐపీవోకు ముసాయిదా పత్రాలు దాఖలు చేసేందుకు ఎల్ఐసీ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నది. అయితే, ఎల్ఐసీలో 5% షేర్లు మాత్రమే ప్రభుత్వం విక్రయించనున్నదని సమాచారం. దీని ప్రకారం 6.23 బిలియన్ల షేర్లలో ప్రభుత్వం 316 మిలియన్ల షేర్లు విక్రయిస్తుందని తెలుస్తున్నది. ఈ వారంలో ముసాయిదా ఐపీవో పత్రాలు సమర్పించడానికి ఎల్ఐసీ సిద్ధం అవుతున్నది.
ఎల్ఐసీ ఎంబీడెడ్ విలువ 72 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంత మొత్తం షేర్లు విక్రయించాలన్న విషయమై శుక్రవారం జరిగే ఎల్ఐసీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. అయితే, ఎంత షేర్ విక్రయించాలన్న విషయమై చర్చలు జరుగుతున్నదని, మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీనిపై స్పందించడానికి ఎల్ఐసీ గానీ, ఆర్థికశాఖ అధికార ప్రతినిధి గానీ అందుబాటులోకి రాలేదు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఐపీవో ద్వారా ఎల్ఐసీ వాటాల విక్రయం ఇదే మొదటిసారి. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు ద్రవ్యలోటు తగ్గించుకోవడానికి వీలుగా ఐపీవో ద్వారా ఎల్ఐసీ వాటాలను విక్రయించాలని కేంద్రం భావిస్తున్నది. రెండేండ్లుగా ఎల్ఐసీ ఐపీవో కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎల్ఐసీ ఆస్తుల విలువ సుమారు 500 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా. ఇంతకుముందు నిర్ణయం మేరకు 5-13 బిలియన్ల డాలర్ల విలువ గల షేర్లను విక్రయించాలని సర్కార్ భావించినట్లు సమాచారం. కానీ అంతకంటే తక్కువ వాటా మాత్రమే విక్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.