హైదరాబాద్, ఆగస్టు15: వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. భారత్ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం నాడిక్కడ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ‘ఇండియా@75-ఐదు ట్రిలియన్ డాలర్లవైపు కదంతొక్కుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సుబ్బారావు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల కలను సాధించాలంటే దేశం ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. పెట్టుబడుల పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విద్య, వైద్య రంగాల ప్రగతి, ఉపాధి కల్పన, వ్యవసాయ దిగుబడి పెంపు, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, అంతర్జాతీయ మెగా ట్రెండ్స్ను ఎదుర్కోవడం, గవర్నెన్స్ పెంపొందించడం ఈ సవాళ్లని సుబ్బారావు వివరించారు. 5 ట్రిలియన్ల సాధనకు వచ్చే ఐదేండ్లూ జీడీపీ వార్షికంగా 9 శాతం చొప్పున వృద్ధి చెందాలని, అయితే ఈ కల 2028-29లోపు నెరవేరదని చెప్పారు.