World Bank – India | భారత్ ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు (World Bank) సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత దేశానికి 75 ఏండ్లు పడుతుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ‘మిడిల్ ఇన్కం ట్రాప్’ నుంచి బయట పడటానికి మార్గాలపై ప్రపంచ బ్యాంక్ బ్లూ ప్రింట్ విడుదల చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతోపాటు 100కిపైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
‘ప్రపంచ అభివృద్ధి నివేదిక – 2024’ అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. ‘ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే అమెరికన్ల తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి చైనాకు పదేండ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏండ్లు, భారత్కు 75 ఏండ్లు పడుతుంది. గత 50 ఏండ్ల అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రకారం దేశాలు సంపన్నంగా ఎదుగుతున్నాయి. కానీ అమెరికన్ వ్యక్తిగత తలసరి జీడీపీ రోజుకు 8000 డాలర్లు. ఆయా దేశాల పౌరుల తలసరి జీడీపీ పది శాతం. ఈ దేశాలన్నీ మధ్య ఆదాయ ట్రాప్ లోనే చిక్కుకున్నాయి’ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వీటిని మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించింది.
‘వ్యక్తిగత తలసరి అభివృద్ధి ప్రకారం 2023 చివరికల్లా 108 దేశాలు మధ్యాదాయ దేశాలుగా నిలిచాయి. ప్రతి దేశంలో ప్రతి పౌరుడి తలసరి జీడీపీ 1136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య నిలుస్తుంది. ప్రపంచ జనాభాలో 75 శాతం జనాభా 600 కోట్ల మంది ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. వీటిల్లో మూడింట రెండొంతల మంది పేదరికంలో జీవిస్తున్నారు’ అని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. 1990 నుంచి కేవలం 34 మాత్రమే మధ్యాదాయ దేశాల స్థాయి నుంచి అధికాదాయ దేశాలుగా మారాయి. వాటిల్లో యూరోపియన్ యూనియన్ గ్రూపు దేశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.