Duvvuri Subbarao | హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగా 2029కల్లా ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇంకా పేద దేశంగానే ఉంటుందేమోనన్న అనుమానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్తం చేశారు. కాబట్టి సంబురాలకు తావు లేదన్నారు. సోమవారం ఇక్కడ పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. సౌదీ అరేబియా ధనిక దేశమైనప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశం కాబోదని గుర్తుచేశారు. అలాగే ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినా.. ఇక్కడి పేదరికం అంతమైపోయినట్టు కాదన్నారు.
దేశంలో 140 కోట్లకుపైగా జనాభా ఉన్నదని, ఇక్కడ అధిక ఉత్పత్తికి జనమే కారణమన్న ఆయన.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచినంత మాత్రాన ఇక్కడి పేదరికం అంతా పోతుందని కాదని అన్నారు. ఈ క్రమంలోనే తలసరి ఆదాయం విషయంలో భారత్ 139వ స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఇక 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపైనా దువ్వూరి స్పందించారు. అందుకు ప్రభావవంతమైన చట్టాలు, బలమైన రాజ్యం, జవాబుదారీతనం, స్వతంత్రంగా పనిచేసే సంస్థ లు అవసరమని అన్నారు.
అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పీ చిదంబరంలు వడ్డీరేట్ల తగ్గింపునకు ఆర్బీఐపై ఒత్తిడి తెచ్చేవారని, తద్వారా దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ఎక్కువగా చూపే ప్రయత్నం చేసేవారని దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘జస్ట్ ఏ మెర్సెనరీ?: నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరుతో రాసిన తన పుస్తకంలో ఈ మేరకు తెలియజేశారు.
‘రిజర్వ్ బ్యాంక్ యాజ్ ది గవర్నమెంట్స్ చీర్లీడర్?’ పేరిట రాసిన చాప్టర్లో వడ్డీరేట్ల విషయంలో మాత్రమే అప్పటి కేంద్ర ప్రభుత్వ జోక్యం పరిమితం కాలేదని.. జీడీపీ, ద్రవ్యోల్బణం అంశాల్లోనూ నిజాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు. ఇక చిదంబరం తన న్యాయవాది తెలివితేటలతో వాదించేవారన్న దువ్వూరి.. ప్రణబ్ ముఖర్జీని మాత్రం పక్కా రాజకీయవేత్తగా అభివర్ణించారు. ఏపీకి చెందిన దువ్వూరి 2008 సెప్టెంబర్ నుంచి 2013 సెప్టెంబర్ వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు.