ముంబై, మార్చి 21: అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్..దేశీయ విమానయాన రంగంపై భారీ అంచనాను ప్రకటించింది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 31 వేల మంది పైలట్లు, 26 వేల మంది మెకానిక్లు అవసరం ఉంటుందని అంచనావేస్తున్నది. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన సమావేశంలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తా మాట్లాడుతూ..వచ్చే 20 ఏండ్లలో దక్షిణాసియా దేశాల్లో విమానయాన రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోనున్నదని, ముఖ్యంగా భారత్కు 31 వేల మంది పైలట్లు, 26 వేల మంది విమానాలను మరమ్మత్తులు చేసేవారు అవసరం ఉంటుందని తెలిపారు. కరోనా తర్వాత విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ రంగంపై ఎలాంటి ప్రభావం పడదని ఆయన వ్యాఖ్యానించారు. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా..గత నెలలో బోయింగ్, ఎయిర్బస్లకు 470 విమానాల ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.