కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు విధానాలు అర్థరహితంగా ఉంటున్నాయని అంతర్జాతీయ స్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశ ఆర్థిక ప్రగతి కోసమంటూ ప్రకటిస్తున్న పథకాల్లో పసలేదన్న వాదనల్ని వినిపిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంకా చురుగ్గా ఉండాలంటూ ఓ రకంగా చురకల్నే పెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు వృథానేనని ప్రముఖ విదేశీ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ భారతీయ విభాగం ప్రధాన ఆర్థికవేత్త వ్యాఖ్యానించడం గమనార్హం.
ముంబై, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వ విధానాలు లక్ష్య సాధన లేనివేనా?.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అంటూ ప్రకటిస్తున్న పథకాలతో ఒరిగేదేమీ లేదా?.. ముందుచూపుతో కాకుండా మొక్కుబడిగా మోదీ సర్కారు నిర్ణయాలుంటున్నాయా?.. ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమే వినిపిస్తున్నదిప్పుడు. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ ఊదరగొడుతూ దేశంలో తయారీ రంగాన్ని ఓ రకంగా క్రమపద్ధతిలో ఎదగనీయడం లేదన్న విమర్శలు అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి మరి. గురువారం ప్రముఖ విదేశీ బ్రోకరేజీ దిగ్గజం, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఉత్పాదక రంగాన్ని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో తయారీని విపరీతంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల చెప్పుకోదగ్గ రీతిలో లాభమేమీ ఉండబోదన్నారు. ఈ క్రమంలోనే రాబోయే మూడేండ్లలో భారత వృద్ధిరేటు కనీసం పెరిగేందుకూ ఇది సాయపడకపోవచ్చనడం గమనార్హం.
బిగించడం కాదు.. తయారవ్వాలి
దేశంలో అమ్ముడవుతున్న వస్తూత్పత్తులు స్థానికంగానే తయారవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం.. దేశంలోకి దిగుమతుల్ని పెంచుతున్నదే తప్ప, ఉత్పత్తిని కాదని జైన్ ఈ సందర్భంగా అన్నారు. నేడు ప్రతీ దేశంలో ఉత్పాదక రంగం బలంగా ఉన్నదని, భారత్లో మాత్రం విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని, బిగిస్తున్నారని చెప్పారు. ఆటో, మొబైల్ ఫోన్లుసహా అన్ని రంగాల్లో పరిస్థితి ఇలాగే ఉందన్న ఆమె.. ఇలాగైతే భారత్ స్వయం ఉత్పాదక దేశంగా ఎప్పుడు ఆవిర్భవిస్తుందన్న రీతిలో విరుచుకుపడ్డారు. కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనం శూన్యమేనన్నారు. ఈ పథకాలతో దేశీయ ఉత్పాదక రంగాని కంటే విదేశీ దిగుమతిదారులకే లాభం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రస్తుత విధానాలను సమీక్షించి, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితం ఉంటుందన్న విధంగా స్పందించారు.
7 శాతం మాత్రమే
ప్రపంచంలో వ్యాపారాభివృద్ధికి అత్యధిక అవకాశాలున్న దేశాల్లో భారత్ ముందున్నది. ఇందుకు కారణం దేశ జనాభానే. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అశ్రద్ధల వల్ల చైనా, అమెరికా వంటి దేశాలకు భారతీయ సంపద వెళ్లిపోతున్నది. అవకాశాలను, వనరులను సద్వినియోగం చేసుకుంటే భారత్ మరింత వృద్ధిపథంలో దూసుకెళ్లగలదు. ఇదే అభిప్రాయాన్ని జైన్ కూడా వెలిబుచ్చారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, అయినప్పటికీ మొబైల్ తయారీలో ప్రపంచంలో భారత్ వాటా కేవలం 7 శాతంగానే ఉందన్నారు. దిగుమతయ్యే మొబైల్ ఫోన్లే మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే దేశీయ మొబైల్ తయారీ సామర్థ్యాన్ని 7 శాతం నుంచి 25 శాతానికి పెంచుకోగలమన్నారు. దీనివల్ల అటు దేశ జీడీపీ, ఇటు దేశ ఎగుమతులూ పుంజుకోగలవని సూచించారు.
‘వచ్చే మూడేండ్లలో భారతీయ జీడీపీ వృద్ధిరేటు ఏమాత్రం పెరగబోదని అనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న తయారీ రంగ ప్రోత్సాహకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం ఉండబోదు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ (పీఎల్ఐ) స్కీములు వృథానే’.
-తన్వీ గుప్తా జైన్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త