న్యూఢిల్లీ, జనవరి 22: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు వస్తున్న మార్కెట్లలో భారత్దే అగ్రస్థానం ఇప్పుడు. గడిచిన ఏడాది కాలంలో చైనా, జపాన్ దేశాల్లో కలిసి నమోదైన ఐపీవోల కంటే కేవలం భారత్లో వచ్చినవే ఎక్కువగా ఉండటాన్నిబట్టి ఇక్కడ పబ్లిక్ ఇష్యూ రష్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చరిత్ర మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఎంత ఉత్సాహంగా ఐపీవోలు వస్తున్నాయో.. వాటి పెర్ఫార్మెన్స్ మాత్రం అంత నిరుత్సాహకరంగా ఉంటున్నది మరి.
స్వల్పకాలిక మదుపే..
ఐపీవోలపట్ల ఆసక్తి కనబరుస్తున్న మదుపరులు.. ఎంతోకాలం ఆయా సంస్థలతో కొనసాగడం లేదు. ఫలితంగా ఆయా షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశీయ పబ్లిక్ మార్కెట్లలో మాత్రమే పెట్టుబడి పెడుతున్న బొటిక్ సంస్థ వైకే2 పార్ట్నర్స్ వివరాల ప్రకారం 2004లో పెట్టుబడిగా పెట్టిన ప్రతీ 100 రూపాయలు.. 2014లో రూ.72కు పడిపోయింది. సగటున ప్రతీ ఐపీవో ఏటా మైనస్ 3.5 శాతం నష్టాన్నిచ్చినట్టు సంస్థ చెప్తున్నది. ఇందుకు మేనేజ్మెంట్లు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు, యాంకర్ ఇన్వెస్టర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, మీడియా, దేశ-విదేశీ పరిస్థితులు, రెగ్యులేటర్లు అన్నీ కారణమేనని తమ నోట్లో వైకే2 సహ వ్యవస్థాపకులు అరుణ్ అగర్వాల్, వినోద్ నాయర్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉండట్లేదంటున్నారు. గత పదేండ్లకుపైగా కాలం లో ఎన్ఎస్ఈ500 ఇండెక్స్లోని దాదాపు 77 శాతం సూచీలు ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చాయి.
సెబీ దృష్టి పెట్టాలి
ఐపీవోకు వస్తున్న సంస్థలు స్టాక్ మార్కెట్లలో నిలదొక్కుకునేందుకు సెబీ తన పరిధిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని వైకే2 అంటున్నది. అప్పుడే దీర్ఘకాలిక సంపద సృష్టి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నది. ఐపీవో ఇన్వెస్టర్లందరికీ ఏడాదిపాటు లాకిన్ పీరియడ్ పెట్టాలని సూచిస్తున్నది. అప్పుడే ఫండమెంటల్స్ ఆధారంగా ట్రేడింగ్ జరుగుతుందని, లేనిపోని ఆకర్షణల ప్రభావం ఉండబోదంటున్నది.