న్యూఢిల్లీ, ఆగస్టు 25: కూరగాయల ధరలు తగ్గితేనే కేంద్ర బ్యాంక్ నిర్దేశిత 6 శాతంలోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని, అప్పుడు ధరల సూచి ఏ దిశగా వెళుతుందన్న అంశంపై స్పష్టత లభిస్తుందని రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మెంబర్ అషిమా గోయల్ చెప్పారు. టమోటల తదితర ఆహారోత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరిగాయని, అయితే సీజనల్గా కూరగాయలు ఒక షాక్ ఇచ్చిన తర్వాత తగ్గుతాయని అంచనా వేస్తున్నామన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థతో గోయల్ మాట్లాడుతూ కూరగాయల ధరలు తగ్గుముఖం పడితే ద్రవ్యోల్బణం తమ నిర్దేశిత 2-6 శ్రేణిలోకి వస్తుందన్నారు. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. సీపీఐలోని ఆహార ధరల సూచి ఏకంగా మూడేండ్ల గరిష్ఠం 11.5 శాతం పెరిగింది.
పెట్రో ధరలు తగ్గించవచ్చు
తృణధాన్యాలు, పప్పు దినుసులు, మసాలా దినుసుల ధరలు సైతం ఆకాశాన్నంటాయని, వీటి దించడానికి సరఫరా సంబంధిత చర్యల్ని ప్రభుత్వం తీసుకున్నదని అషిమా గోయల్ వివరించారు. వీటి ధరల్ని ప్రభుత్వ చర్యల (ఎగుమతులపై నిషేధం, దిగుమతి సుంకాల తగ్గింపు, వ్యాపారుల నిల్వలపై నియంత్రణలు వంటివి) ద్వారా అదుపు చేయవచ్చని, అటువంటి అస్ర్తాలు ప్రభుత్వం వద్ద చాలానే ఉన్నాయని చెప్పారు. ఇంధన ధరల్ని తగ్గిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా వచ్చే నష్టమేదీ ఉండదని, కేవలం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపైనే ఆ ప్రభావం పడుతుందని గోయల్ చెపుతూ ఇటువంటి చర్యలతో కుటుంబాల ధరాభారం తగ్గుతుందని ప్రభుత్వానికి సూచించారు. ఆర్బీఐ ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో అషిమా గోయల్, జయంత్ వర్మ, శశాంక్ భిడేలు కేంద్రం నియమించిన స్వతంత్ర సభ్యులు.
లిక్విడిటీ కట్టడికి బదులు రెపో పెంచాలి
రూ.2,000 నోట్ల రద్దు తర్వాత వచ్చిపడిన డిపాజిట్లతో బ్యాంక్ల వద్ద పేరుకుపోయిన లిక్విడిటీని కట్టడి చేయడమే కేంద్ర బ్యాంక్ ప్రాధాన్యత అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ పాత్ర చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ద్రవ్య సమీక్షా సమావేశపు మినిట్స్ తాజాగా ఆర్బీఐ విడుదల చేసింది. ఈ సమావేశంలో మైఖల్ అభిప్రాయంపై అషిమా గోయల్ వ్యాఖ్యానిస్తూ ఒక స్థాయి తర్వాత లిక్విడిటీని కట్టడి చేయరాదని, దీంతో స్వల్పకాలిక వడ్డీ రేట్లు రెపో రేటును మించిపోతాయన్నారు. రేట్లు పెంచాల్సివస్తే రెపో రేటునే పెంచాలని సూచించారు. మరో ఇండిపెండెంట్ సభ్యుడు జయంత్ వర్మ ప్రస్తుత రెపో రేటు ద్రవ్యోల్బణాన్ని దించడానికి అవసరమైనంత గరిష్ఠస్థాయిలో ఉన్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.