India Inc Raises Funds | గతేడాది కరోనా మహమ్మారి ప్రభావం నుంచి పలు రంగాల వ్యాపారాలు కోలుకున్నాయి. క్షేత్రస్థాయిలో వస్తు, సేవలకు డిమాండ్ పెరిగింది. గిరాకీకి అనుగుణంగా కార్యకలాపాలు విస్తరించిన వివిధ సంస్థలు అందుకు 2021లో నిధులు సమకూర్చుకున్నాయి. ఈక్విటీ, డెట్ రంగాల నుంచి రూ.9.01 లక్షల కోట్ల నిధులు సేకరించాయి. వీటిల్లో రూ.5.53 లక్షల కోట్లు డెట్ మార్కెట్, రూ.2.1 లక్షల కోట్లు ఈక్విటీల ద్వారా పొందాయి. రిట్స్ ఇన్విట్స్ నుంచి రూ.30,840 కోట్లు, ఓవర్సీస్ ఇష్యూల ద్వారా రూ.1.06 లక్షల కోట్లు సేకరించాయి.
2020లో రూ.11 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి కార్పొరేట్ సంస్థలు. వాటిల్లో డెట్ మార్కెట్ నుంచి రూ.7.91 లక్షల కోట్లు, ఈక్విటీల ద్వారా రూ.2.12 లక్షల కోట్లు సేకరించాయి. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్.. తదితర వైరస్లు తీవ్ర ప్రభావం చూపకుంటే 2022లోనూ భారీగా నిధుల సేకరణ జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డెట్ మార్కెట్ నుంచి వచ్చిన పెట్టుబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. కానీ, ఈక్విటీ ద్వారా సమకూరిన నిధుల్లో మాత్రం ఎటువంటి క్షీణత లేకపోవడం విశేషం. పెద్ద మొత్తంలో కంపెనీలు ఐపీఓకి రావడం, స్టాక్ మార్కెట్ పరుగులు ఈక్విటీ నిధుల సమీకరణకు కారణమయ్యాయి.