న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఆధార్ విశ్వసనీయతను, దాని పనితీరును గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ ప్రశ్నించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) గట్టిగా ఖండించింది. ఏ ఆధారం లేకుండా ఇటువంటి ఆరోపణలు సరికావని తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ఆధార్ వ్యవస్థలో తరచూ సేవల నిరాకరణ జరుగుతున్నదని, ఈ బయోమెట్రిక్ టెక్నాలజీలను నమ్మలేమని మూడీస్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఉష్ణ, తేమతోకూడిన ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు ఆధార్ సేవలు ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడింది. దీంతో యూఐడీఏఐ స్పందిస్తూ ‘ఆధార్.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ. గడిచిన దశాబ్దానికిపైగా కాలంలో 100 కోట్లకుపైగా భారతీయులు 10వేల కోట్లసార్లు దీన్ని వినియోగించి ఆధార్పట్ల తమకున్న నమ్మకాన్ని కనబర్చారు’ అని అన్నది. ఆధార్ను వ్యతిరేకిస్తూ ఏ ప్రాతిపదికన మూడీ స్ ఈ ఆరోపణలు చేసిందని ప్రశ్నించింది.