IMF on India |భారత్కు కొన్ని మధ్యంతర నిర్మాణాత్మక సమస్యలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. వాటిల్లో డిజిటల్ కరెన్సీతోపాటు క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణ ఒకటి అని ఐఎంఎఫ్ మానిటరీ క్యాపిటల్ మార్కెట్స్ విభాగం డైరెక్టర్ టోబియాస్ అడ్రియన్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో మిగిలిన నియంత్రణ సమస్యల పరిష్కారంతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో దానిని ఏకీకృతం చేయడం భారత్ ముందు ఉన్న సమస్యలన్నారు. అయితే, భారత్ను తమ సంస్థ చాలా సానుకూల ధోరణితో చూస్తుందన్నారు. భారత్లో వృద్ధి పునరుద్ధరణకు తగిన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు టోబియాస్ అడ్రియన్ చెప్పారు. కొత్త వృద్ధి అవకాశాలు, పరిణామాలను సానుకూలంగా తీసుకోవడానికి భారత్ చాలా ఉత్సాహం ఉందన్నారు.
అన్ని వర్గాలకు విస్తృత ప్రాతిపదికన అభివృద్ధి ఫలాలు అందాలని ఐఎంఎఫ్ కోరుకుంటుందని టోబియాస్ చెప్పారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిబంధనలతో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ దశలోనే భారత్ ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే క్రిప్టో లావాదేవీలపై భారత్ పన్ను విధానం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
భారత్లో డిజిటల్ కరెన్సీతోపాటు అన్ని రంగాలకు వృద్ధి ఫలాలు అందడం చాలా కీలకం అని, అందుకు భారత్ ఎలా వ్యవహరిస్తుందన్న విషయమై నిశితంగా ఐఎంఎఫ్ గమనిస్తుందని టోబియాస్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వానిజ్యంలో భాగం కావడం భారత్కు చాలా ప్రయోజనకరం అని అన్నారు. కరోనా మహమ్మారి వేళ భారత్ అనుసరించిన విధానంతో పెరుగుతున్న సావరిన్ రుణ భారంపై ఆందోళన అక్కర్లేదన్నారు.