Shakti Kant Das – Gold | భారత్ బంగారం నిల్వలు పెంచుకుంటున్నదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఫారెక్స్ రిజర్వు నిల్వల పెంపులో భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటున్నట్లు తెలిపారు. ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం తర్వాత శక్తికాంత దాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అయితే, ఎంత మొత్తం బంగారం నిల్వలు పెంచుకున్నదన్న సంగతి వెల్లడించలేదు. కానీ, ఆర్బీఐ అధికారిక గణాంకాల ప్రకారం బంగారం నిల్వలు పెరుగుతున్నాయి. మార్చి 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వల్లో బంగారం నిల్వల విలువ 51.487 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. 2023 మార్చి నెలాఖరుతో పోలిస్తే 6.287 బిలియన్ డాలర్లు ఎక్కువ.
జనవరిలో ఆర్బీఐ 8.7 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. జనవరి నెలాఖరు నాటికి ఆర్బీఐ బంగారం నిల్వలు 812.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023 డిసెంబర్ నెలాఖరుకల్లా ఆర్బీఐ వద్ద 803.58 బిలియన్ డాలర్ల విలువ గల బంగారం నిల్వలు ఉన్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. గత కొన్ని నెలలుగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మెరుస్తున్నాయి.
మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 645.6 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్టాన్ని తాకాయని శక్తికాంత దాస్ చెప్పారు. గత నాలుగైదేండ్లుగా ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంపైనే ఆర్బీఐ ఫోకస్ చేస్తున్నదన్నారు. అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగించడం కూడా ఆర్బీఐ ప్రాధాన్యాల్లో ఒకటన్నారు. భారత్ నుంచి డాలర్లలో నిధులు వెళ్లిపోయినా ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఫారెక్స్ నిల్వలు పెంచుకుంటున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.