న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠపడుతున్న దిశలో తిరిగి అంతర్జాతీయ సవాళ్లు ముంచుకొస్తున్నాయని రిజర్వ్బ్యాంక్ హెచ్చరించింది. విస్త్రతస్థాయిలో వ్యాక్సిన్ కవరేజ్, ఫైనాన్షియల్ రంగం స్థిరత్వం, ఎగుమతుల జోరుతో ఆర్థిక వ్యవస్థ పటిష్ఠపడుతున్నదని, ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రిస్క్లు ఏర్పడ్డాయని తాజాగా విడుదలైన ఆర్బీఐ ఏప్రిల్ బులెటిన్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. సంవత్ 2079లో భారత్ ప్రవేశించిన తర్వాత కొవిడ్ మూడోవేవ్ నుంచి కోలుకోవడంతో పలు రంగాల్లో వృద్ధి వేగం పుంజుకున్నదని కేంద్ర బ్యాంక్ తెలిపింది. అయితే ఈ లాభాలన్నీ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో రిస్క్లో పడ్డాయని, ద్రవ్యోల్బణం పెరగడం, ఫైనాన్షియల్ పరిస్థితులు కఠినతరంకావడం, విదేశీ పోర్ట్ఫోలియో నిధులు దేశం నుంచి తరలివెళ్లడం వంటి రిస్క్లు ఏర్పడ్డాయన్నది. ఆర్థికాభివృద్ధి కొనసాగాలంటే ప్రైవేటు పెట్టుబడులు పెరగడం కీలకాంశమని ఆర్బీఐ పేర్కొంది. అంతర్జాతీయ ప్రతికూలాంశాల ప్రభావం నుంచి భారత్ తప్పించుకోలేదని, అయితే ఆర్థిక వ్యవస్థ అంతర్గత ఫండమెంటల్స్ పటిష్ఠత, విదేశీ మారక నిల్వలు బాసటగా నిలుస్తాయని ఆర్బీఐ బులెటిన్ వ్యాసకర్తలు వివరించారు.