న్యూఢిల్లీ, అక్టోబర్ 9: డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). రిటైల్ టర్మ్ డిపాజిట్లతోపాటు ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. సాధారణ ప్రజలకు 7.40 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం చెల్లిస్తున్నది. అలాగే 399 రోజుల కాలపరిమతి కలిగిన తిరంగ ప్లస్ డిపాజిట్ స్కీంపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నది. దీంతోపాటు రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును ఒక్క శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీని రెండు సార్లు పంచిన విషయం తెలిసిందే.