Maruti Suzuki | మారుతి సుజుకి.. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. మార్కెట్ వాటాలోనూ మారుతిదే పై చేయి. టెక్నాలజీతో కార్ల తయారీలో సమూల మార్పులు రావడంతో ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. మొదటి వరుసలోనే నిలుస్తున్నది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎస్యూవీ క్యాటగిరీ కార్ల పట్ల కస్టమర్లు మనస్సు పారేసుకుంటున్నారు. కస్టమర్ల నుంచి గిరాకీ ఎక్కువగా ఉండటంతో వచ్చే పది రోజుల్లో రెండు కొత్త మోడల్ ఎస్యూవీ కార్లు మార్కెట్లోకి తెస్తామని చెప్పారు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ. ఎస్యూవీ క్యాటగిరీలో 46 మోడల్ కార్లు ఉంటే తమ సంస్థకు కేవలం రెండు మోడల్ కార్లే ఉన్నాయని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎస్యూవీ క్యాటగిరీలో మారుతి సుజుకి బలహీనంగా ఉందని శశాంక్ శ్రీవాత్సవ అంగీకరించారు. నాన్-ఎస్యూవీ, ఎస్యూవీ కార్లతో కలిపి తమ మార్కెట్ 45 శాతం కంటే తక్కువేనన్నారు. నాన్-ఎస్యూవీ కార్ల మార్కెట్లో తమ వాటా 65 శాతానికంటే ఎక్కువనని తెలిపారు. దీన్ని 50 శాతానికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఎస్యూవీ పోర్ట్పోలియోను బలోపేతం చేస్తామని, త్వరలో మరిన్ని ఎస్యూవీ కార్లు మార్కెట్లోకి తెస్తామన్నారు.
ఇటీవలే తాము గ్రాండ్ విటారా, న్యూ బ్రెజా మోడల్ కార్లను మార్కెట్లోకి తెచ్చామని శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. వచ్చే పది రోజుల్లో ఆటో ఎక్స్పోలో రెండు ఎస్యూవీ కార్లు ఆవిష్కరిస్తామని చెప్పారు. 2022లో తొమ్మిది మోడల్ కార్లను అప్గ్రేడ్ చేశామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి పెంచుతామని తెలిపారు. ప్రస్తుతం గిరాకీకి అనుగుణంగా కార్ల ఉత్పత్తి జరుగడం లేదని శశాంక్ శ్రీవాత్సవ అంగీకరించారు. ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్ 6, బ్రెజా, డిజైర్, స్విఫ్ట్ మోడల్ కార్లు బుకింగ్ చేసుకున్న కస్టమర్లు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తున్నదన్నారు.