న్యూఢిల్లీ, జనవరి 1: మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా మిగతా ఆటో సంస్థల విక్రయాలు గత నెల పర్వాలేదనిపించాయి. డిసెంబర్లో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు, అంతర్జాతీయ ఎగుమతులు కలిపి 1,37,551 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్లో ఇవి 1,39,347 యూనిట్లుగా నమోదవగా.. 1.28 శాతం తగ్గినట్టు తేలింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో తదితర ప్రవేశ స్థాయి మినీ కార్లకు డిమాండ్ పడిపోయింది. బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ మాడళ్లకూ ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని సంస్థ పేర్కొన్నది. అయితే బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంగ్జ్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 కార్ల అమ్మకాలు పెరగడం విశేషం.
2023 మొత్తంగా..
గత ఏడాది మొత్తంగా ఆటో సంస్థల అమ్మకాలు ఆకట్టుకున్నాయి. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 41.08 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2022తో పోల్చితే 8.3 శాతం వృద్ధి కనిపించింది. నాడు 37.92 లక్షల యూనిట్లే అమ్ముడయ్యాయి. తయారీదారుల నుంచి డీలర్లకు చేరిన వాహనాల్లో దాదాపు సగం ఎస్యూవీలే ఉండటం గమనార్హం. ఇక 2023లో వాహన సగటు ధర రూ.11.5 లక్షలుగా ఉన్నట్టు తేలింది. 2022లో ఇది రూ.10.58 లక్షలు.
కరోనాకు ముందు 2019-20లోనైతే రూ.8.2 లక్షలే. పెరిగిన ఉత్పాదక వ్యయమే ఇందుకు కారణమని పరిశ్రమ చెప్తున్నది. కాగా, గత ఏడాది దేశీయంగా మారుతి సుజుకీ వాహన విక్రయాలు తొలిసారి 20 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటానే 7.76 లక్షల యూనిట్లుగా ఉండటం విశేషం. ఎగుమతులు 2,69,046 యూనిట్లుగా ఉన్నాయి. హ్యుందాయ్ నిరుడు దేశీయంగా, ఎగుమతులు కలిపి 7,65,786 వాహనాలను అమ్మింది. 2022తో చూస్తే 9 శాతం పెరిగాయి.