న్యూయార్క్ : ప్రకటనల రాబడి తగ్గిపోవడంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్లను నిర్వహించే టెక్ దిగ్గజం మెటా లాభాలు 50 శాతం పైగా పతనమయ్యాయి. ఈ ఏడాది మూడో క్వార్టర్కు కంపెనీ ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రకటనల రాబడి, ఆదాయం గణనీయంగా తగ్గడంతో నాలుగో క్వార్టర్లోనూ నిరాశజనకమైన ఫలితాలే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది నాలుగో క్వార్టర్లో మొత్తం రాబడి 30-32.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపింది.
మెటా ఫలితాలపై స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా స్పందించింది. కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం పడిపోవడంతో మెటా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6700 కోట్ల డాలర్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాల తరహాలోనే ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులు ప్రకటనల రాబడి మందగించడానికి దారితీయడంతో మెటా ఇబ్బందులకు లోనైంది. ఇదే సమయంలో కంపెనీ పెద్ద ఎత్తున వనరులు, సమయాన్ని మెటావర్స్పై వెచ్చించింది.
ఇంటర్నెట్ భవితవ్యంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మెటావర్స్పై విశ్వాసం ఉంచారు. మెటావర్స్ ప్రణాళికలపై వెనక్కితగ్గేది లేదని కంపెనీ స్పష్టం చేసింది. మెటా సేవలను వాడే యూజర్ల సంఖ్య పెరుగుతోందని మార్క్ జుకర్బర్గ్ వివరించారు. తాము రాబోయే కొద్దిరోజులు రాబడికి సంబంధించిన సవాళ్లు ఎదుర్కొన్నా పటిష్టమైన రెవెన్యూ వృద్ధికి సానుకూల అంశాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇక కంపెనీ రాబడిలో భారీగా గండిపడటంతో హైరింగ్ నిలుపుదలతో పాటు ఇతర నిర్వహణా వ్యయాలను తగ్గించుకోవడంపై మెటా దృష్టి సారిస్తోంది.