న్యూఢిల్లీ : కన్జూమర్ గూడ్స్ దిగ్గజ కంపెనీ యూనిలివర్ 1500 మంది మేనేజ్మెంట్ సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. టేకోవర్ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో వాటాదారుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించే క్రమంలో పునర్వ్యవస్ధీకరణ ప్రయత్నాల్లో భాగంగా 1500 మంది మేనేజర్లను తొలగించాలని యోచిస్తోందని కంపెనీ యాక్టివ్ ఇన్వెస్టర్ ఒకరు తెలిపారు. డోవ్ సోప్, మ్యాగ్నమ్ ఐస్క్రీం వంటి ఉత్పత్తులు కలిగిన ఈ దిగ్గజ సంస్ధలో ప్రపంచవ్యాప్తంగా 1,49,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కంపెనీ ప్రధానంగా బ్యూటీ, వెల్బీయింగ్, పర్సనల్ కేర్, హోం కేర్, న్యూట్రిషన్, ఐస్ క్రీం విభాగాలపై దృష్టిసారించనుంది. ఈ రంగాలపై ప్రత్యేక ఫోకస్ను కేంద్రీకరించడం ద్వారా మెరుగైన డెలివరీ జవాబుదారీతనం పెంపొందేలా చర్యలు చేపట్టామని యూనిలివర్ సీఈఓ అలన్ జోప్ చెప్పారు. గత ఏడాదిగా 13 శాతం పైగా కంపెనీ షేర్లు పడిపోయిన క్రమంలో కంపెనీ తాజాగా గ్లాక్సోస్మిత్క్లైన్స్ కన్జూమర్ హెల్త్కేర్ బిజినెస్ కొనుగోలు ప్రణాళికలను ఇటీవల విరమించుకుంది.
పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియ ఫ్యాక్టరీ వర్కర్లపై ప్రభావం చూపబోదని యూనిలివర్ చెబుతోంది. మరోవైపు జీఎస్కే ఒప్పందం విఫలం కావడం యూనిలివర్కు గట్టి ఎదురుదెబ్బని వాణిజ్య విశ్లేషకులు పేర్కొన్నారు. కీలక వాణిజ్య రంగాలపై యూనిలివర్ దృష్టి సారించకుండా ఇతర విభాగాలపై కేంద్రీకరిస్తోందని వారు చెబుతున్నారు. కోర్ బిజినెస్పై కంపెనీ దృష్టిసారించి కార్యకలాపాలను గాడినపెట్టాలని సూచిస్తున్నారు.