న్యూఢిల్లీ : కియా సొనెట్ సేల్స్ 1.5 లక్షల మైలురాయిని దాటాయి. 2020 సెప్టెంబర్లో లాంఛ్ అయిన తర్వాత కేవలం రెండేండ్లలోనే కియా సొనెట్ ఈ ఘనత సొంతం చేసుకుంది. 2022 మేలో కియా ఏకంగా 7899 సొనెట్ కార్లను సేల్ చేసి బ్రాండ్లో ఒకనెలలో అత్యధిక కార్లను అమ్మిన రికార్డు సొనెట్ పేరిట నమోదైంది. కియా సొనెట్ సేల్స్లో 26 శాతం టాప్ ఎండ్ వేరియంట్స్ (ఎక్స్ ప్లస్ మోడల్స్) నుంచి నమోదవుతున్నాయని కంపెనీ పేర్కొంది.
22 శాతం కొనుగోలుదారులు ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. పెట్రోల్ యూనిట్లపై కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నా మొత్తం సేల్స్లో కియా సొనెట్ డీజిల్ విక్రయాలు 41 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. కియా సొనెట్ లక్షన్నర యూనిట్ల సేల్స్ మార్క్ను దాటడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ యంగ్ సిక్ సాన్ స్పందించారు.
కియా ఇండియా కుటుంబంలో సొనెట్ ద్వారా 1.5 లక్షల మంది కస్టమర్లు చేరారని, నేటి నగర కస్టమర్ అభిరుచులకు తగినట్టుగా తాము సరైన ప్రోడక్ట్ను డిజైన్ చేశామని చెప్పారు. ఇక కియా సొనెట్ రూ 7.15 లక్షల నుంచి రూ 13.69 లక్షల మధ్య అందుబాటులో ఉంది. కియా సొనెట్కు హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజా, టొయోటా అర్బన్ క్రూజర్, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్యూవీ300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ల నుంచి పోటీ ఎదురవుతోంది.