IIT-Bombay | విద్య నేర్పిన గురువు.. చదువుకున్న విద్యా సంస్థ పట్ల విద్యార్థులకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి. తాము చదువుకున్న విద్యా సంస్థ మరింత సమున్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే (ఐఐటీ-బీ) పూర్వ విద్యార్థులు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భవిష్యత్లో విద్యార్థులకు విద్యాబోధన కోసం 1998’ బ్యాచ్ విద్యార్థులు రూ.57 కోట్ల విరాళం అందజేశారు. ఇప్పటి వరకు దేశంలోని ఐఐటీల్లో పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాల్లో ఇదే గరిష్టం. ఇంతకుముందు 1971వ బ్యాచ్ విద్యార్థులు తమ స్వర్ణోత్సవాల సందర్భంగా రూ.41 కోట్ల విరాళం అందించారు.
భవిష్యత్ విద్యార్థుల ఆకాంక్షలకు మద్దతుగా ఐఐటీ-బాంబేలో క్రిటికల్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం 1998 బ్యాచ్ విద్యార్థులు ఈ విరాళం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లతోపాటు స్టూడెంట్ ఎయిడ్ ఇన్షియేటివ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రో ఫ్యాక్టరీ, శాస్త్రీయ సాంకేతిక ఆవిష్కరణలకు మార్కెట్ స్పేస్ ల్యాబ్స్ స్థాపించడానికి ఈ నిధులు ఖర్చు పెట్టాలని సూచించారు. అలాగే సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా మైండ్స్ (సీ-మైన్డీఎస్) లో ఎండోమెంట్ ఫండ్, ఫండ్ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉపయోగించాలని సూచించారు.
ఈ విరాళం అందజేసిన వారిలో వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ, సిల్వర్ లేక్ మేనేజింగ్ డైరెక్టర్ అపూర్వ సక్సేనా, గూగుల్ డీప్ మైండ్ ఏఐ రీసెర్చ్ దిలీప్ జార్జ్, గ్రేట్ లెర్నింగ్ సీఈఓ మోహన్ లఖంరాజు, పీక్ ఎక్స్వీ ఎండీ శైలేంద్ర సింగ్, అమెరికాస్ @ హెచ్సీఎల్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీకాంత్ శెట్టి తదితర 200 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో వివిధ స్టార్టప్ సంస్థల నుంచి కార్పొరేట్ సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశిష్ చౌదరి మాట్లాడుతూ.. ఈ విరాళం తమ సంస్థలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, పరిశోధనలు చేపట్టేందుకు ఉపకరిస్తుందన్నారు. వచ్చే ఏడేండ్లలో ప్రపంచంలోనే టాప్-50 విశ్వవిద్యాలయాల్లో ‘ఐఐటీ-బాంబే’ను నిలిపేందుకు పూర్వ విద్యార్థుల చొరవ ఉపకరిస్తుందన్నారు.