Paytm UPI Lite | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మొత్తాల్లో చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకొచ్చిన యూపీఐ లైట్ ఫీచర్ ప్రారంభించింది. ఈ ఫీచర్ ప్రారంభించిన తొలి బ్యాంక్ తమదేనని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ ప్రజలంతా డిజిటల్ పేమెంట్స్కు మళ్లాలన్న లక్ష్యంతోనే ముందుకెళుతున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల సింగిల్ క్లిక్ ద్వారా శరవేగంగా రియల్ టైంలో లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన యూపీఐ లైట్ (UPI LITE) ఫీచర్ ను 2022 సెప్టెంబర్ లో ఆర్బీఐ ప్రారంభించింది. చిన్న మొత్తాల పేమెంట్స్ అనుమతించే యూపీఐ లైట్ వల్ల పేటీఎం ఖాతాలో బ్యాలెన్స్, హిస్టరీ వివరాలు కనిపిస్తాయని, పాస్ బుక్లో కనిపించవు.
‘యూపీఐ లైట్ వాలెట్ను ఒకసారి ప్రారంభిస్తే రూ.200 వరకు ఇన్ స్టంట్ లావాదేవీలు శరవేగంగా, నిరంతరాయంగా పూర్తి చేయొచ్చు. గరిష్టంగా రూ.2000 వరకు ఒక రోజు రెండు సార్లు లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రూ.4000 లోడ్ చేసుకునే సదుపాయం ఉంది’ అని పేటీఎం తెలిపింది. తత్ఫలితంగా రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీల పరిమితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో 50 శాతానికి పైగా రూ.200 లోపే ఉంటున్నాయి. కనుక యూపీఐ లైట్ ఫీచర్ సాయంతో మరింత స్పీడ్గా డిజిటల్ పేమెంట్స్ పూర్తి చేయొచ్చునని పేటీఎం వెల్లడించింది.
తక్కువ విలువ గల లావాదేవీలు విజయవంతంగా జరిపేందుకు యూపీఐ లైట్ ఉపకరిస్తుందని ఎన్పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్ తెలిపారు. ఈ ఫీచర్ వల్ల లావాదేవీల శాతం మరింత పెంచడవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక రోజులు 100 కోట్ల లావాదేవీలకు చేరువ కావచ్చునన్నారు.