Indian Budget | 1947 ఆగస్టు 15న మనదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడే దేశ విభజన సమస్యలతో రెండు వర్గాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ఘర్షణల మధ్య 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ను మొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ ఆర్కే షణ్ముగం షెట్టార్ ప్రవేశ పెట్టారు. నాటి నుంచి 1948 మార్చి 31 వరకు కేవలం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా రూ.171.15 కోట్లు. అంచనా ద్రవ్యలోటు రూ.24.59 కోట్లు. అంతకుముందు తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్న లియాఖత్ అలీఖాన్ 1947-48 బడ్జెట్ సమర్పించారు.
ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటన్ రాజరికానికి 1858 ఏప్రిల్ ఏడో తేదీన బదిలీ అయ్యింది. తర్వాత రెండేండ్లకు 1860 ఏప్రిల్ ఏడో తేదీన భారత్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశ పెట్టారు.
భారత్ బడ్జెట్లో వచ్చే పన్నుల మార్పుల గురించి అప్పటి బ్రిటన్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చేంజర్ హ్యూ డాల్టన్ ఓ జర్నలిస్టుతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. ఈ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టక ముందే సదరు జర్నలిస్టు వార్తాకథనం ప్రచురించడంతో హ్యూ డాల్టన్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. నాటి నుంచి బడ్జెట్పై గోప్యత ఒక ముఖ్య లక్షణంగా మారింది.
సాధారణ బడ్జెట్ ప్రతులను 1950 వరకూ రాష్ట్రపతి భవన్లో ప్రచురించే వారు. ఆ ఏడాది బడ్జెట్ లీక్ కావడంతో ప్రింటింగ్ స్థలాన్ని మింట్ రోడ్డులోకి మార్చేశారు. 1980లో నార్త్ బ్లాక్లో బడ్జెట్ కోసం ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాటి నుంచి ఇక్కడే బడ్జెట్ ప్రతుల ముద్రణ జరుగుతున్నది. బడ్జెట్ ముద్రణకు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 1955 వరకూ ఇంగ్లిష్ భాషలోనే బడ్జెట్ ప్రతులు సమర్పించే వారు. తర్వాత హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే ముద్రించడం మొదలు పెట్టారు.
1860 నుంచి భారత్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన బ్రిటన్ పాలకులు.. 1924 నుంచి విడిగా రైల్వే బడ్జెట్ తెచ్చారు. నాటి నుంచి 2016 వరకూ రైల్వే, సాధారణ బడ్జెట్లు వేర్వేరుగా సమర్పించారు. 2017లో నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ.. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం చేశారు.
పలు దేశాల రాజ్యాంగాల్లో కీలకాంశాలతో మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. అలాగే బ్రిటిష్ కాలం నాటి ఆచారం ప్రకారం ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి రోజు సాయంత్రం ఐదు గంటలకు సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టే వారు. కానీ 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయం ఫిబ్రవరి చివరి తేదీ ఉదయం 11 గంటలకు మార్చారు. తిరిగి 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చేశారు.
భారత్ పాలనా వ్యవహారాలపై గతంలో బ్రిటిష్ సంప్రదాయాల ముద్ర కొనసాగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆర్థిక మంత్రి గోధుమ, ఎరుపు రంగు బ్యాగ్లో బడ్జెట్ పత్రాలను తీసుకుని పార్లమెంట్కు వచ్చే వారు. 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకూ ఇలాగే సాగింది. 2020లో కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి 2021లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత రెండేండ్లుగా టచ్ ప్యాడ్లో బడ్జెట్ నిక్షిప్తం చేసి పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేస్తున్నారు.
త్వరలో లోక్ సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్ కానున్నది.