హైదరాబాద్, అక్టోబర్ 18: హైదరాబాద్కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల సంస్థయైన ఐకేఎఫ్ ఫైనాన్స్ మరో మైలురాయిని సాధించింది. సేవలు ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, చైర్మన్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ..రూ.10 కోట్లతో మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన సంస్థ, ప్రస్తుతం రూ.2 వేల కోట్లు దాటినట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు మరో ఏడు రాష్ర్టాల్లో సేవలు అందిస్తున్న సంస్థకు 130 శాఖలు ఉండగా..వచ్చే మూడేండ్లకాలంలో
ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ప్రస్తుతం సంస్థలో 800 మంది సిబ్బంది ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్యను 1,850కి పెంచుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.6 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మరోవైపు రూ.500-700 కోట్ల నిధులను ఇతర మార్గాల ద్వారా సేకరించనున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.