న్యూఢిల్లీ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఇండోర్ (IIM Indore) విద్యార్ధికి తుది ప్లేస్మెంట్ సెషన్లో ఏకంగా 1.14 కోట్ల వేతన ప్యాకేజ్తో జాబ్ ఆఫర్ లభించింది. తమ ఇనిస్టిట్యూట్లో ఫైనల్ ప్లేస్మెంట్లో ఇదే అత్యధిక వేతన ప్యాకేజ్ అని ఐఐఎం అధికారులు పేర్కొన్నారు. గత సెషన్లో తమ విద్యార్ధికి రూ. 49 లక్షల అత్యధిక వేతన ప్యాకేజ్ లభించగా ఈ ఏడాది రూ. 65 లక్షలు అధికంగా ఆఫర్ చేశారని తెలిపారు.
ఐఐఎం ఇండోర్ విద్యార్ధులకు 160కి పైగా దేశీ, విదేశీ కంపెనీలు రూ. 30.2 లక్షల సగటు వేతనాలను ఆఫర్ చేశాయి. ఎంబీఏతో సమానమైన రెండేండ్ల పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (పీజీపీ), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్ధులకు ఈ ఆఫర్స్ లభించాయి.
ఫైనల్ ప్లేస్మెంట్లో కన్సల్టింగ్ విభాగంలో 29 శాతం ఉద్యోగాలు ఆఫర్ చేయగా, ఆపరేషన్స్, జనరల్ మేనేజ్మెంట్ విభాగంలో 19 శాతం జాబ్ ఆఫర్స్, ఫైనాన్స్ విభాగంలో 18 శాతం, ఐటీలో 16 శాతం జాబ్ ఆఫర్లు దక్కాయని ఐఐఎం ఇండోర్ తెలిపింది.
విద్యార్ధులకు ప్రపంచ స్ధాయి మేనేజ్మెంట్ విద్యను సమకూర్చడం ద్వారా పరిశ్రమతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సిద్ధమని ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ తమ విద్యార్ధులు అద్భుతమైన ప్లేస్మెంట్ ఆఫర్లను సొంతం చేసుకోవడం తమ విద్యా సంస్ధ ప్రమాణాలకు నిదర్శనమని ఆయన అన్నారు.
Read More :
Mukesh Ambani | మళ్లీ ముకేశే నెం.1.. ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన అంబానీ