హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కు శుక్రవారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) అవార్డు లభించింది. 112.2 కోట్ల చదరపు అడుగుల్లో అభివృద్ధి చేసిన 736 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకుగాను ఈ పురస్కారం దక్కింది. చెన్నైలో ఐజీబీసీ నిర్వహిస్తున్న మూడు రోజుల గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నరసింహారెడ్డి అవార్డును తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో గ్రీన్ బిల్డింగ్ల అభివృద్ధికి టీఎస్ఐఐసీ, ఐజీబీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.