గతవారం నిఫ్టీ 21,593 పాయింట్ల రికార్డుస్థాయిని తాకింది. వెనువెంటనే 21,076 పాయింట్ల కనిష్ఠస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత కోలుకుని 21,349 పాయింట్ల వద్ద ముగిసింది. వారం మొత్తంమీద 107 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ వారం ట్రెండ్పై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటం, సోమవారం క్రిస్మస్ సెలవు అయినందున ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకావడం, గతవారం మార్కెట్లో ఒడిదుడుకులు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో నిఫ్టీ పరిమితశ్రేణిలో కన్సాలిడేట్ అవుతుందని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్, చార్ట్ఎనలిటిక్స్ ఫౌండర్ ఎం చద్దా అంచనావేశారు. గత 20 ఏండ్ల ట్రేడింగ్ చరిత్ర ప్రకారం శాంటాక్లాజ్ ర్యాలీ జరగవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు. డిసెంబర్ చివరి ఐదు రోజులు, జనవరి తొలి రెండు రోజుల్లో మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు.
ఈ వారం నిఫ్టీకి 21,000 వద్ద పటిష్ఠమైన మద్దతు లభిస్తున్నదని, ఆ దిగువన 20 రోజుల ఎస్ఎంఏ రేఖ కదులుతున్న 20,830 స్థాయి వద్ద మద్దతు ఉన్నదని జిమిత్ మోది విశ్లేషించారు. 21,600 నిరోధాన్ని అధిగమిస్తే 21,750-21,800 వరకూ పెరగవచ్చన్నారు. 21,490, 21,600 స్థాయిలు అవరోధాన్ని కల్గించవచ్చని, 21,100, 21,950 స్థాయిలు మద్దతును అందిస్తాయని మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు.