ముంబై, డిసెంబర్ 6: కొత్త ప్రైవేటు బ్యాంక్ల్లో విదేశీ వాటా పరిమితిపై ఉన్న నిబంధనలకు నీళ్ళొదులుతూ ప్రైవేటీకరణ బాటలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటాను విదేశీయులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్లో యాజమాన్య వాటాను విదేశీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభు త్వం మంగళవారం ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా కోసం బిడ్స్ సమర్పించేందుకు గడువు తేదీ అయిన ఈ నెల 16 సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. ఆసక్తిగల బిడ్డర్ల ప్రశ్నలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) స్పందిస్తూ.. కొత్తగా బ్యాంక్లను నెలకొల్పదల్చిన ప్రమోటర్లకు దేశీయులు అయి ఉండాలన్న ఆర్బీఐ నిబంధనలు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐడీబీఐ బ్యాంక్కు వర్తించవని తెలిపింది. భారత్ వెలుపల (విదేశీ) నెలకొన్న ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా కొనవచ్చని సూచించింది.
అమ్మకానికి 60.72 శాతం వాటా
ఐడీబీఐ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు (ఎల్ఐసీ) కలిపి 94.71 శాతం వాటా ఉన్నది. ఇందులో 60.72 శాతం వ్యూహాత్మక వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. విజయవంతమైన బిడ్డరు 5.28 శాతం పబ్లిక్ వాటాకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వం చెంత 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం వాటా (మొత్తం 34 శాతం) ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ను టేకోవర్ చేయదల్చిన ఇన్వెస్టర్లు కనీసం రూ.22,500 కోట్ల నికర విలువ కలిగి ఉండాలని దీపం నిర్దేశించింది. అర్హులైన బిడ్డర్లు గత ఐదేండ్లుగా నికరలాభం సాధించడం తప్పనిసరిగా పేర్కొంది. గరిష్ఠంగా నలుగురు సభ్యులు లేదా సంస్థలతో కూడిన కన్సార్షియం ఈ బ్యాంక్ కోసం బిడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.63,116 కోట్లు ఉన్నది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో ఈ షేరు 7.5 శాతం పెరిగి రూ.58.30 వద్ద ముగిసింది.