క్యూ4లో నాలుగింతలైన లాభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను ఆకర్షణీయ లాభాలను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.4,886 కోట్లకు ఎగిసింది. క్రిందటిసారి రూ.1,251 కోట్లే. దీంతో దాదాపు నాలుగింతలైనైట్లెంది. ఇక స్టాండలోన్ నికర లాభం రూ.4,402 కోట్లుగా నమోదైనట్లు శనివారం బ్యాంక్ తెలియజేసింది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే మూడింతలకుపైగా పెరిగినట్లు తేలింది. నాడు రూ.1,221 కోట్ల లాభాలకే పరిమితమైంది. కాగా, స్టాండలోన్ ఆదాయం మాత్రం స్వల్పంగానే పెరిగింది. ఈసారి రూ.23,953 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.23,443.66 కోట్లుగా ఉన్నది. ఏకీకృత ఆదాయం మాత్రం గతంతో పోల్చితే రూ.40,121 కోట్ల నుంచి 43,621 కోట్లకు ఎగబాకింది. మరోవైపు స్థూల నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్పీఏలు) ఈ మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో 5.53 శాతం నుంచి 4.96 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలూ 1.41 శాతం నుంచి 1.14 శాతానికి దిగివచ్చాయి.