ICICI Bank Alert | కరోనా మహమ్మారి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. క్యాష్ ట్రాన్స్ఫర్ మొదలు వివిధ రుణాలపై నెలవారీ రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ దాదాపు అన్ని లావాదేవీలు ఆన్లైన్లోనే సాగుతున్నాయి. వాటితోపాటు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ మోసగాళ్లు మాల్వేర్ వెబ్ లింక్స్, ఈ-మెయిల్స్, స్పామ్ కాల్స్ ద్వారా వివిధ బ్యాంకుల ఖాతాదారులతో కనెక్టయి మోసాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లో లక్షలు, కోట్లు డ్రా చేసేస్తున్నారు.
బ్యాంకుల ఖాతాదారులు అసలు సంగతి తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. ఇలా సైబర్ మోసగాళ్లు చేసే ఆగడాలపై బ్యాంకులన్నీ తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. సూచనలు, సలహాలిస్తూ ఆన్లైన్ లావాదేవీల పట్ల అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తన ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు కొన్ని సూచనలు చేసింది. ప్రత్యేకించి ఫేస్బుక్, వాట్సాప్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది.
`సైబర్ మోసగాళ్లు ఫోన్ కాల్ చేసి మా ఖాతాదారులను ఏమార్చి `యూపీఐ పిన్ నంబర్` తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అలాంటి కాల్స్ను నమ్మవద్దు. ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాల ద్వారా నగదు రిక్వెస్ట్లు పంపుతున్నారు. మా ఖాతాదారులను నమ్మించడానికి వారికి సమీప బంధు, మిత్రుల ఫొటోలు వాడుతున్నారని మా దృష్టికొచ్చింది. అటువంటి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు సదరు ఖాతా ఒరిజినలా.. నకిలీనా.. అన్నసంగతి ముందుగా నిర్ధారించుకోవాలి. ఏదైనా అనుమానం.. సందేహం కలిగితే సంబంధిత సోషల్ మీడియా ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు` అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కనుక ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది.
వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా వచ్చే మెసేజ్లు, యూఆర్ఎల్ లింక్లు, వెబ్ లింక్లు ఓపెన్ చేయకుండా ఉండటమే మంచిదని ఖాతాదారులకు ఐసీఐసీఐ స్పష్టం చేసింది. ఎవరికైనా మీ ఫోన్ ఇవ్వాల్సి వస్తే.. బ్రౌజర్ హిస్టరీ, టెంపరరీ ఫైల్స్ బ్లాక్ చేయాలని, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు యాక్సెస్ కాకుండా బ్లాక్ చేయాలని సూచించింది.
బహిరంగ ప్రదేశాల్లోని వై-ఫై కనెక్షన్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ లావాదేవీలు జరుపొద్దని ఐసీఐసీఐ బ్యాంక్ తేల్చి చెప్పింది. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ల డౌన్లోడింగ్ కోసం వచ్చే లింక్లను అసలు తెరువొద్దని హితవు చెప్పింది. మెసేజ్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ డిటైల్స్ షేర్ చేయొద్దని తెలిపింది. ఆన్లైన్ లావాదేవీలు పూర్తి కాగానే యాప్ నుంచి లాగౌట్ కావాలని సూచించింది.