న్యూఢిల్లీ, నవంబర్ 1: రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి కూడా.
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ సమాచారం మేరకు ఒక్కరోజు, నెల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతానికి, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 8.55 శాతంగాను, 8.90 శాతానికి పెంచాయి. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును 9 శాతానికి సవరించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రుణ రేట్లు 7.95 శాతం నుంచి 8.95 శాతం మధ్యలోకి చేరుకున్నాయి.