Hyundai | ఇప్పుడంతా టెక్నాలజీమయం.. అనునిత్యం కొత్త టెక్నాలజీ వస్తూనే ఉన్నది. దీనివల్ల ఎలక్ట్రానిక్ గూడ్స్, స్మార్ట్ ఫోన్లతోపాటు కార్లు సైతం నాజూగ్గా తయారవుతున్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోయేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కార్ల తయారీలో సేఫ్టీ కోసం సీట్ బెల్ట్లు తప్పనిసరి చేసింది కేంద్రం. కార్ల తయారీ సంస్థలు సైతం తమ కార్లను మరింత సేఫ్టీగా రూపొందిస్తున్నాయి. ఆ జాబితాలో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ వచ్చి చేరింది.
కొత్తగా మార్కెట్లోకి వచ్చే క్రెటా, వెన్యూ, ఐ20 మోడల్ కార్లలో హ్యుండాయ్ నూతన సేఫ్టీ ఫీచర్లు జత చేసింది. ఈ మూడు కార్లలోనూ స్టాండర్డ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగునంగా త్రీ-పాయింట్ సీట్ బెల్ట్లు అమర్చింది. అన్ని కార్లలో రేర్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు త్రీ-పాయింట్ సీట్బెల్ట్ పొందుతారు. ఈ మూడు మోడల్ కార్లలోనూ ప్రయాణించే వారు సౌకర్యవంతంగా కూర్చుకోవడానికి సీట్ల వెనుక అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు కూడా జత చేసింది. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ల కంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లతో మెరుగైన రక్షణ లభిస్తుంది. క్రెటా, వెన్యూ మోడల్ కార్లలో రేర్ బెంచ్, 2- స్టెప్ రీక్లైనర్ సీట్ ఆప్షన్ల మధ్య 60:40 నిష్పత్తిని కొనసాగిస్తుంది. ఐ-20 ఫోన్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అందుబాటులో లేవు.
ఒకవైపు మరింతగా కర్బన ఉద్గారాల నియంత్రణకు బీఎస్-6 2.0 ప్రమాణాలు కార్ల తయారీ సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. అందులో భాగంగా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం అమర్చాలంటే కాస్ట్లీ వ్యవహారం. దీనికి తోడు సేఫ్టీ కోసం క్రెటా, వెన్యూ, ఐ-20 కార్లలో కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నది హ్యుండాయ్. కానీ ఈ ఫీచర్లు జత చేసినందుకు ఈ మూడు కార్ల ధరలు మాత్రం యధాతథంగా కొనసాగిస్తున్నది.
కార్లలో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం కేంద్రం కఠినమైన నిబంధనలు తెస్తున్నది. రేర్ సీట్లో త్రీ-పాయింట్ సీట్బెల్ట్ తప్పనిసరి చేసింది. అన్ని కార్లకు స్టాండర్డ్ క్రాష్ టెస్ట్ రేటింగ్ కూడా అమల్లోకి రాబోతున్నది. అన్ని కార్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆరు ఎయిర్బ్యాగ్ల నిబంధన అమల్లోకి రానున్నది.