Hyundai- General Motors | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా.. మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ తాలేగావ్ (మహారాష్ట్ర) యూనిట్ కొనుగోలు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశంలో మారుతి సుజుకి తర్వాత అత్యధికంగా కార్లు విక్రయిస్తున్న సంస్థ హ్యుండాయ్. జనరల్ మోటార్స్ తాలేగావ్ యూనిట్ కొనుగోలు ఒప్పందం డీల్ ఎంత అన్న సంగతి బయట పెట్టలేదు.
ఇప్పటికే శ్రీపెరంబదూర్ (చెన్నై)లో గల తన ప్లాంట్తోపాటు తాలేగావ్ ప్లాంట్ ద్వారా ఏటా పది లక్షల కార్లు ఉత్పత్తి చేయాలన్నది హ్యుండాయ్ మోటార్ ఇండియా లక్ష్యం. తాలేగావ్ యూనిట్ టేకోవర్ ఒప్పందంలో జనరల్ మోటార్స్ కంపెనీ భూమి, భవనాలు, యంత్రాలు, కార్ల తయారీ పరికరాలు కూడా ఉన్నాయని హ్యుండాయ్ తెలిపింది. 2025 నుంచి తాలేగావ్ యూనిట్లో కార్ల తయారీ ప్రారంభించాలని భావిస్తున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ యూన్సూ కిమ్ తెలిపారు.
గతేడాది కంపెనీ 5,52,511 కార్లు విక్రయించింది. మొత్తం దేశీయంగా గతేడాది కార్ల విక్రయంలో హ్యుండాయ్ వాటా 14.5 శాతం. 2023లో జూన్ వరకే 3,46,711 యూనిట్లు విక్రయించింది. మరోవైపు, 2030 నాటికి మొత్తం తమ కార్ల విక్రయాల్లో ఈవీ కార్ల వాటా 30 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో హ్యుండాయ్ ముందుకెళుతున్నది.
తాజా ఒప్పందంతో అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ (జీఎం) కంపెనీ.. భారత్ నుంచి నిష్క్రమించడానికి మార్గం సుగమమైంది. దేశంలో రోజురోజుకు తమ కార్ల విక్రయాలు పడిపోవడంతో జనరల్ మోటార్స్ 2017లోనే కార్ల అమ్మకాలు నిలిపేసింది. కానీ, తన ప్రొడక్షన్ యూనిట్ల కొనుగోలుకు ఇతర సంస్థలేవీ రాకపోవడంతో భారత్ నుంచి పూర్తిగా వైదొలగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ యూనిట్ను 2019లో చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్కు విక్రయించడానికి జనరల్ మోటార్స్ అంగీకరించింది. కానీ, చైనా పెట్టుబడులపై కేంద్రం ఆంక్షలు తేవడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది.
తాలేగావ్ జనరల్ మోటార్ ప్రొడక్షన్ యూనిట్లో కార్ల ఉత్పత్తి కెపాసిటీ 1.30 లక్షలు. ఇప్పటికే హ్యుండాయ్ మోటార్స్ తన కార్ల ఉత్పత్తి సామర్థ్యం 7.50 లక్షల నుంచి 8.20 లక్షలకు పెంచుకున్నది. జనరల్ మోటార్స్ తాలేగావ్ ప్లాంట్ సాయంతో 10 లక్షల యూనిట్ల తయారీకి పునాది ఏర్పడుతుందని హ్యుండాయ్ వెల్లడించింది.