Hyundai Motors | కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ‘ఎక్స్టర్ (Exter)’ సాయంతో తమ కార్ల విక్రయాలు పుంజుకున్నాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ చెప్పారు. దేశీయ కార్ల మార్కెట్లో ఎస్యూవీల సెగ్మెంట్ సేల్స్ తమ లక్ష్యానికి అనుగుణంగా 60 శాతానికి పైగా ఉన్నాయని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో విదేశాలకు ఎగుమతులు కూడా పెరిగాయని తరుణ్ గార్గ్ చెప్పారు.
గత నెలలో హ్యుండాయ్ కార్ల విక్రయాలు 18.5 శాతం పుంజుకుని 68,728 యూనిట్లకు చేరాయి. ఈ ఏడాది పది నెలల్లో కార్ల విక్రయాల్లో 11.5 శాతం గ్రోత్ నమోదైంది. 2023లో ఇప్పటి వరకూ 6,43,535 యూనిట్లు అమ్ముడయ్యాయని. దేశీయంగా 5,09,910 యూనిట్లు (9.49 శాతం గ్రోత్) సేల్ అయ్యాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎస్ యూవీ కార్ల సేల్స్ 53 శాతంగా నమోదయ్యాయని, వాటిల్లో క్రెటా కీలకంగా మారిందని, తాజాగా ఎక్స్టర్ జత కలిసిందని తరుణ్ గార్గ్ చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు కూడా తమ నిర్దేశిత లక్ష్యం 1.6 లక్షల యూనిట్లను దాటేస్తామని తరుణ్ గార్గ్ చెప్పారు. కొన్ని నెలలుగా విదేశాలకు కార్ల ఎగుమతులు పెరిగాయన్నారు. జూలై నుంచి ప్రతి నెలలో 4,000 కార్ల ఉత్పత్తి పెంచడంతో దేశీయ విక్రయాలు, ఎగుమతులనూ బ్యాలెన్స్ చేస్తున్నట్లు చెప్పారు.